కేసీఆర్ పై పోటీచేసి గెలుస్తానని సవాల్ విసిరిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్

పార్టీ అధిష్టానం ఆదేశిస్తే తెలంగాణ ముఖ్యమంత్రి , టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫై పోటీ చేసి గెలుస్తానని సవాల్ విసిరారు దుబ్బాక బిజెపి ఎమ్మెల్యే రఘునందన్ రావు. నల్గొండ పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న రఘునందన్ రావు..మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. నల్గొండ జిల్లాలో జానారెడ్డి ఓటమితోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కనుమరుగు అయిందన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ రూ.500 కోట్లు ఖర్చు పెట్టినా బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ గెలిచారని, టీఆర్‌ఎస్‌ పట్ల ప్రజలకు తీవ్ర వ్యతిరేకత ఉన్నందున బీజేపీ నాయకులు ప్రజల్లోనే ఉండి పోరాడితే వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికారం బీజేపీదేనని ధీమా వ్యక్తం చేశారు.

అగ్నిపధ్ పధకం పై ప్రతిపక్షాలు రాజకీయం చేసి కేంద్రాన్ని భద్నాం చేస్తున్నాయన్నారు. నిరసన తెలియజేసే హక్కు ఎవరికైనా ఉంటుందని, కానీ ప్రజల ఆస్తులను ధ్వంసం చేయడం ఏంటని ప్రశ్నించారు. రైల్వే ఆస్తుల్ని తగులబెడుతుంటే రాష్ట్ర పోలీసులు ఏం చేశారని, నిఘా వ్యవస్థ ఎక్కడ పోయిందని నిలదీశారు. పోలీసు కాల్పుల్లో ఒక అభ్యర్థి మరణించడం బాధాకరమని, అతని అంతిమయాత్రలో టీఆర్‌ఎస్‌ పార్టీ జెండాలు కట్టి ఇతరులను రానీయకుండా అడ్డుకోవడాన్ని శవరాజకీయంగా అభివర్ణించారు.