టంగ్ క్లీనర్ కోసం జగనన్న సుశ్వాస పథకం తెస్తారేమో

వైస్సార్​ చిరునవ్వు పథకంపై రఘురామ వ్యంగ్యం

అమరావతి : వైఎస్సార్ చిరునవ్వు పథకంపై ఆ వైస్సార్ సీపీ ఎంపీ రఘు రామ కృష్ణ రాజు విమర్శలు గుప్పించారు. ప్రతి నెలా వలంటీర్లతో బ్రష్షూ, పేస్టు ఇచ్చి వెళ్తారట అంటూ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మరి, టంగ్ క్లీనర్ ఇస్తున్నారా అని అడిగితే లేదన్నారంటూ కామెంట్ చేశారు. మంచి శ్వాసకు టంగ్ క్లీనర్ కూడా కావాలి కాబట్టి.. కొన్ని రోజుల తర్వాత జగనన్న సుశ్వాస పేరిట పథకం తీసుకొస్తారని సెటైర్లు పేల్చారు. సాక్షిలో పెద్ద యాడ్, మిగతా పేపర్లలో ఫార్మాలిటీకి ప్రకటనలు ఇచ్చి ప్రచారం చేస్తారని అన్నారు.

ఈ పథకాలు ఎవరు అడిగారని, ముందు శాంతి భద్రతలను నియంత్రించాలని ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులు బాగున్నాయని సర్కార్ అంటోందని, మరి, కరోనా సోకిన బొత్స సత్యనారాయణ అపోలో ఆసుపత్రికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా అపోలోకే వెళ్లారన్నారు. భవిష్యత్ లో హాస్పిటల్ హబ్స్ నిర్మిస్తామన్న రాష్ట్ర సర్కార్ ప్రకటనపై ఆయన మండిపడ్డారు.

పేర్ని నాని అబద్ధాలు చెప్పరని, ముక్కుసూటి మనిషి అని అన్నారు. సినిమా టికెట్లను ఆన్ లైన్ లో ఇవ్వాలని, టికెట్ల ధరలను పెంచాలని చిరంజీవి, నాగార్జునలు కోరారనడం మాత్రం నమ్మబుద్ధి కావట్లేదని అన్నారు. చాలా మందికి ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేయడం తెలియదని, అలాంటి వారు సినిమాలు ఎలా చూస్తారని ప్రశ్నించారు. బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చినా పన్ను వసూళ్లు మాత్రం రాలేదనడం ప్రభుత్వ చేతగానితనమేనని ఆయన విమర్శించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/