భారత వాయుసేనలోకి రేపు ఐదు ‘రాఫెల్’
న్యూఢిల్లీ: రేపు భారత వాయుసేనలోకి ఐదు రాఫెల్ యుద్ధవిమానాలను ప్రవేశపెట్టానున్నారు. భారత ప్రభుత్వం ఫ్రాన్స్ నుంచి మొత్తం 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నది. ఈ ఒప్పందం విలువ రూ.60 వేల కోట్లు. ఒప్పందంలో భాగంగా ఫ్రాన్స్కు చెందిన డస్సాల్ట్ ఏవియేషన్ సంస్థకు భారత్ ఇప్పటికే సగానికిపైగా డబ్బును చెల్లించింది. మొదటి విడతలో భాగంగా ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు ఫ్రాన్స్ నుంచి జూలై 29న భారత్ చేరాయి. ఇందులో రెండు సీట్లు కలిగిన శిక్షణ విమానాలు కాగా, మరో మూడు ఒకే సీటు కలిగిన యుద్ధ విమానాలు. విమానాలు భారత్చేరిన మరుసటి రోజు నుంచే వాయుసేన శిక్షణ ఇవ్వడం ప్రారంభించింది. ఈ అత్యాధునిక విమానాలను రేపు అధికారికంగా ప్రారంభిస్తుండటంతో భారత వాయుసేనకు చెందిన 17 గోల్డెన్ ఆరోస్ స్క్వాడ్రన్లో రాఫెల్ విమానాలు భాగం కానున్నాయి. హర్యానాలోని అంబాలాఎయిర్బేస్లో జరిగే ఈ కార్యక్రమంలో రక్షణమంత్రి రాజ్నాథ్సింగ్, ఫ్రాన్స్ రక్షణమంత్రి ఫ్లారెన్స్ పార్లీ, భారత సైన్యాధికారులు పాల్గొంటారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/