పీఎఫ్ఐను రద్దు చేసిన కేంద్రం
ఉగ్ర కార్యకలాపాలకు నిధుల సమీకరణతో పాటు భారత్ లో మతకల్లోలాలు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్న పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాపై కేంద్ర సర్కార్ నిషేధం విధించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. పీఎఫ్ఐ సహా దాని అనుబంధ సంస్థలను ఐదేళ్ల పాటు బ్యాన్ చేసింది. ఈ నిర్ణయం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది.
కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ), ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్(ఈడీ) మంగళవారం సంయుక్త ఆపరేషన్ చేపట్టి.. 170కి పైగా మందిని అదుపులోకి తీసుకున్నాయి. 7 రాష్ట్రాల్లో PFI సంస్థతో సంబంధం ఉన్న అనేక మంది సభ్యులు, సంస్థ కార్యాలయాల్లో సోదాలు నిర్వహించాయి. ఉత్తర్ప్రదేశ్, మధ్యప్రదేశ్, దిల్లీ, కేరళ, గుజరాత్, కర్ణాటక, అసోంలో ఈ దాడులు జరిగాయి. ఈ ఆపరేషన్లో కేంద్ర నిఘా సంస్థ-ఐబీ, ఆయా రాష్ట్రాల పోలీసులు కూడా భాగమైనట్లు ఎన్ఐఏ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.