ఆ వార్తలు అవాస్తవం
తనపై వచ్చిన వార్తలను ఖండించిన పివి సింధు
హైదరాబాద్: భారత బ్యాడ్మింటన్ తారలు సైనా నెహ్వాల్, పివి సింధు హైదరాబాద్లోని గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న విషయం తెలిసిందే. గతంలో ఆ అకాడమీ నుంచి వెళ్లిపోయిన సైనా నెహ్వాల్ 2017లో తిరిగి గోపీచంద్ అకాడమీకి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ అకాడమీకి సింధు దూరమయ్యేందుకు ప్రయత్నిస్తుందంటూ గతేడాది వార్తలు వచ్చాయి. ఈ ప్రచారాన్ని పివి సింధు ఖండించింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. గోపీచంద్ వద్ద శిక్షణ తీసుకోవడంలో అన్ని పరిస్థితులు బాగున్నాయని తెలిపింది. ఎలాగైనా భారత్కు పతకం అందించాలనేదే తమ ఇద్దరి లక్ష్యమని చెప్పింది. క్రీడాకారులుగా సైనాకు, తనకు మధ్య ఆటపరమైన పోటీ, శత్రుత్వం ఎల్లప్పుడూ ఉంటుందని ఆమె తెలిపింది. బ్యాడ్మింటన్ పోటీలో ఎవరి ఆలోచనలకు తగినట్లుగా వారు ఆడతారని సింధు చెప్పింది. తమ ఇద్దరి మధ్య పోటీ గోపీచంద్కు కొత్తలో కాస్త కష్టంగా అనిపించి ఉండొచ్చని, అయితే, ఆయన కూడా మా పోటీని క్రీడా స్ఫూర్తితో తేలిగ్గా తీసుకొని ఉంటారని పీవీ సింధు తెలిపింది. తమ ఇద్దరిలో ఎవరూ గెలిచినా గోపిచంద్కు సంతోషంగానే ఉంటుందని ఆమె చెప్పింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/