సింధు పేరిట చెన్నైలో బ్యాడ్మింటన్ అకాడమీ
చెన్నై: ప్రపంచ ఛాంపియన్, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు పేరుతో తమిళనాడులోని చెన్నైలో బ్యాడ్మింటన్ అకాడమీ నిర్మా ణమవుతోంది. చెన్నైలోని కోలపాక్కంలో ఒమెగా ఇంటర్నేషనల్ స్కూల్లో ‘హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్’ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న అకాడమీతో పాటు స్టేడియానికి సింధు పేరు పెట్టారు. శంకుస్థాపన కార్యక్రమానికి సింధు స్వయంగా హాజరై పునాదిరాయి వేశారు.
శంకుస్థాపన అనంతరం సింధు మాట్లాడుతూ… ‘ఈ అకాడమీతో దేశ బ్యాడ్మింటన్కు ఎంతో ప్రోత్సాహం లభిస్తుంది. ప్లేయర్లకు శిక్షణ ఇచ్చేందుకే కాకుండా జాతీయ, అంతర్జాతీయ టోర్నీలు ఇక్కడ నిర్వహించే అవకాశం ఉంది. ఈ అకాడమీకి నా పేరు పెట్టడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నా. హార్ట్ఫుల్నెస్లో ధ్యానం చేయడం వల్ల మానసికంగా మరింత ప్రశాంతంగా, దృఢంగా తయారయ్యా. మరింత ఎక్కువగా ఏకాగ్రత సాధించా’ అని అన్నారు. కాగా హార్ట్ఫుల్నెస్ ఇన్స్టిట్యూట్ ఓ ధ్యానం నేర్పించే సంస్థ. కమలేశ్ పటేల్ ఆధ్వర్యంలో ఈ సంస్థ పనిస్చేస్తుంది. గతంలో హార్ట్ఫుల్నెస్లో తెలుగుతేజం సింధు ధ్యాన సాధన చేసింది. అకాడమీ 18 నుంచి 24 నెలల్లో పూర్తవనుంది. ఇందులో మొత్తం ఎనిమిది కోర్టులతో పాటు వెయ్యి మంది కూర్చునే గ్యాలరీ, జిమ్, యోగా, ధ్యానం చేసుకునేందుకు ప్రత్యేక స్థలం లాంటి సదుపాయాలు ఉంటాయని హార్ట్ఫుల్నెస్ తెలిపింది. 8 కోర్టులను అత్యాధునిక హంగులతో నిర్మించనున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/