తెలుగుకే కాదు యావద్దేశానికి పివి ఠీవి
బహుముఖ ప్రజ్ఞావంతుడు పి.వి నరసింహారావు
పి .వి నరసింహా రావు గురించి ఒక్కమాటలో చెప్పడమో, ఆయనలో ఇదీ ప్రత్యేకత అంటూ ఒక అంశాన్నో, ఒక కోణాన్నో చూపడం సాధ్యం కాని పని. ఆయన బహుముఖ ప్రజ్ఞావంతుడు.
రాజకీయ పండి తుడు. సాహితీశిఖరం, అపర చాణక్యుడు. ఆర్థిక నిపుణుడు. దేశంలో ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడు.
పాలనలో, వ్యవస్థలో ప్రమాణాలను నెలకొల్పేందుకు, విలువలను కాపాడేందుకు అత్యున్నత పదవులను సైతం తృణప్రాయంగా త్యజించిన మహానుభావుడు.
ప్రధానిగా ఆయన పాలనా వ్యవహారాలలో బయటి వ్యక్తులు, శక్తుల ప్రమేయం ఉండకూడదన్న విలువల కోసం నంబర్ 10 జన్పథ్ను ప్రభుత్వ వ్యవహారాలకు దూరం గా ఉంచారు.
అదే ఆయనను కాంగ్రెస్పార్టీలో అంటరాని వ్యక్తి గా చేసింది.అయినా ఇసుమంతైనా వెరవలేదు.
భూసంస్కరణల అమలు కోసం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అలవోకగా వదిలేశారు. పివి నరసింహారావు ఇందిరాగాంధీలాగో, ఎన్టీరామా రావులాగో ప్రజాకర్షణ ఉన్న నేతకాదు.
కానీ ప్రజాప్రయోజనాల పరిరక్షణ, ప్రజాజీవన ప్రమాణాల మెరుగుదల కోసం అహర్ని శలూ శ్రమించిన వ్యక్తి.
భారతదేశం ఆర్థిక సంక్షోభం ముంగిట దివాలా తీసే స్థితిలో నిలిచిన సమయంలో ప్రధాని పగ్గాలు చేపట్టిన పివి దేశాన్ని ఒక ఆర్థికశక్తిగా మలచేందుకు దార్శనికత తో వ్యూహాలు, ప్రణాళికలు రూపొందించారు.
ఈ క్రమంలో ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. అయినా నాడు విమర్శించిన వారే ఇప్పుడు దేశానికి దిశ, నిర్దేశనం చేసినది పివి మార్గమేనని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారంటే ఆయన దూర దృష్టి ముందుచూపు ఏమిటో అర్థమవుతుంది.
పవి మృదుస్వభావి. చట్టాలకు అత్యంత విలువనిచ్చిన వ్యక్తి. అందుకే ఆయన ప్రధానిగా ఉన్న సమయంలో తనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఖండనలూ, ఇప్పటి నేతల్లా ఆరోపణలను చేసిన వ్యక్తికి వేధింపులు వంటి వాటి జోలికి పోలేదు.
హుందాగా ఆరోపణలను ఎదుర్కొన్నారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందంటూ తనకు ముడుపులు ఇచ్చినట్లు గా ఒక ఆర్థిక నేరస్తుడు హర్షద్మెహతా (షేర్ల కుంభకోణం మూలవిరాట్టు) చేసిన ఆరోపణలను ఆయన ఎదుర్కొన్నారు.
పులి కడిగిన ముత్యంలా బయటపడ్డారు. ఎంత ఎదిగినా దేశ ప్రధానిగా అత్యున్నత పద విని అధిరోహించినా పివి ఆ హోదానూ, పలుకుబడిని తనకోసం కానీ,తన వారి కోసం కానీ ఇసుమంతైనా ఉపయోగించలేదు.
తమ పదవులను కూడా వార సత్వంగా తమ తరు వాత తమ కుమారులు, మనవ లకు అప్పగించేందుకు పావులుకదిపే నేతలున్న ఈ రోజుల్లో …
తన పదవి,హోదాల వల్ల తన వారెవరికీ ప్రయోజనం చేకూర కూడదన్న విలువలతో బతికిన నిజాయితీ పరుడు పివి నరసింహారావు.
రాజకీయ ప్రత్యర్థులు సైతంగౌరవించే వ్యక్తిత్వం ఆయనది.సొంత పార్టీయే శత్రువుగా చూసిన సమయం లో ఆయన చూపిన స్థితప్రజ్ఞత, పల్లెత్తుమాట అనని వ్యక్తిత్వ ఔన్నత్యం పివి సొంతం.
బాబ్రీ కూల్చివేత ఘటన అనంతరం సర్వత్రా తనపై విమర్శల వర్షం కురిపించినా మౌనంగానే భరించారు.
ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రభుత్వం తరపున ఇచ్చిన హామీని విస్మరించడం ఎవరైనా ఊహించగలరా?
కానీ బాబ్రీ సంఘటన జరిగిన సమ యంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కల్యాణ్సింగ్ (బిజెపి సర్కార్) కేంద్రానికి ఇచ్చిన మాటను విస్మరించి, కరసేవకులు విధ్వంసం సృష్టించేందుకు వీలైన పరిస్థితులు రాష్ట్రంలో కల్పించారు.
అలా చేయడం వల్ల ఆయన పార్టీ బిజెపి తరువాత పొందిన లబ్ధి అందరికి తెలిసిందే.
ఆ రాజకీయ లబ్ధికోసమే జరిగిన మహా కుట్రగా బాబ్రీ కూల్చివేతను పరిగణనలోకి తీసుకోవాలే తప్ప అది పివి వైఫల్యంగానో, మైనారిటీ వ్యతిరేక విధానంగానో భావించడం తగదు.
ఇక మైనారిటీ ప్రభుత్వాన్ని ఐదేళ్లపాటు నిరాటంకంగా, నిర్విఘ్నంగా నడపడంలో పివి చాణుక్యం ఎవరినైనా అబ్బురపరచక మానదు.
జెఎంఎం సభ్యులు కానీ, అప్పటి తెలుగుదేశం ఎంపిలు కానీ సొంత పార్టీని కాదని పివి సర్కార్కు మద్దతు నివ్వడం వారివారి సొంత నిర్ణయంగానే అప్పుడూ చెప్పారు. ఇప్పటికీ చెబుతున్నారు.
పివి వంటి వ్యక్తి ప్రత్యర్థి పార్టీల సభ్యులను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారం టే ఆయన ప్రత్యర్థులు కూడా విశ్వసించజాలరు.
అయితే ఆయన వ్యక్తిత్వ హననానికి ఆయన జీవితం కాలం సేవలందించిన పార్టీలోనే కుట్రలుజరిగాయి.
మరణానంతరం కూడా ఆయనను బదనాం చేయడానికి చరిత్రను వక్రీకరించేందుకు కూడా ఆ పార్టీ పెద్దలు వెనుకాడని తీరు.
అత్యంత గర్హనీయం. జీవితమంతా పార్టీ కోసం పాటుపడిన వ్యక్తి భౌతికకాయాన్ని హస్తినలోని పార్టీ ప్రధాన కార్యాలయంలోనికి కూడా అనుమతించకుండా అమాన వీయంగా వ్యవహరించారు.
అయితే ఇప్పుడు ఆ పార్టీ పివి పేరుస్మరించకుండా, పివి ఆర్థికసంస్కరణలను పార్టీవిధానంగా చేసుకుని ఆయన నామస్మరణతోనే మరోసారి ప్రజామన్ననలు పొందాలని ప్రయత్నిస్తున్నదది.
ప్రపంచం మొత్తం మెచ్చిన మేధావి, మానవతావాది పివి నరసింహారావ్ఞ తెలుగు భాషకు, తెలంగాణ గడ్డకే కాదు యావత్ భారతావనికి ఠివి.
డాక్టర్ సంగని మల్లేశ్వర్, (రచయిత: జర్నలిజం విభాగాధిపతి,కాకతీయ విశ్వవిద్యాలయం)
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/