పుష్ప ట్రైలర్ వాయిదా.. ఆగ్రహంతో ఊగిపోతున్న అభిమానులు..

పుష్ప ట్రైలర్ డిసెంబర్ 06 సాయంత్రం రిలీజ్ అవుతుందని ప్రకటించడం తో అభిమానులు గత మూడు రోజులుగా ఆసక్తి గా ఎదురుచూస్తూ వచ్చారు. ఆ టైం వచ్చేసరికి అభిమానులు షాక్లో పడ్డారు. చెప్పిన టైం అయ్యింది కదా ఇంకా ట్రైలర్ రాలేదేంటి అని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు.

ఈ తరుణంలో కొన్ని టెక్నీకల్ ఇష్యూస్ వలన ట్రైలర్ వాయిదా వేసినట్లు చిత్ర యూనిట్ తెలిపారు. ట్రైలర్ రిలీజ్ చేయడం ఆలస్యమైనందుకు క్షమాపణలు కోరిన మేకర్స్ త్వరలోనే ట్రైలర్ రిలీజ్ చేస్తామని తెలిపారు. దీంతో ఫ్యాన్స్ మైత్రీ మూవీ మేకర్స్ పై మండిపడుతున్నారు. అయితే వాయిదా పడింది అని చెప్పిన చిత్రబృందం మళ్లీ రిలీజ్ ఎప్పుడు చేస్తారో చెప్పకపోయేసరికి ఇంకా ఫ్యాన్స్ విరుచుకుపడుతున్నారు.

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ , లెక్కల మాస్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందుతున్న పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. ఆర్య, ఆర్య 2 తర్వాత ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న హ్యాట్రిక్ సినిమా ఇది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రష్మిక మందన్నా హీరోయిన్ గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ మూవీ పార్ట్‌ 1.. పుష్ప ది రైజ్ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటిస్తుండగా.. మలయాళీ నటుడు ఫహద్ ఫాజిల్ విలన్ రోల్ ప్లే చేస్తున్నాడు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల ఫై దృష్టి పెట్టిన చిత్ర యూనిట్..డిసెంబర్‌ 12 వ తేదీన ఈ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ ను హైదరాబాద్‌ లో నిర్వహించేందుకు ప్లాన్‌ చేస్తుంది. సినిమా రిలీజ్ కు నాల్గు రోజుల టైం ఉంటుంది కాబట్టి ప్రీ రిలీజ్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.