3 వేల కోసం ఐదుగురిని చంపిన సైకో…అరెస్టు
చెన్నై: తమిళనాడులో కేవలం మూడు వేల రూపాయల కోసం ఓ యువకుడు ఏకంగా ఐదుగురిని హత్య చేశాడు. ఒక్కసారిగా ఈ విషయం బయటకు తెలియడంతో స్థానికంగా కలకలం రేపింది. అయితే ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..తిరుచ్చి కంటోన్మెంట్ పరిధిలోని ఒత్తకడై ప్రాంతంలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో సెంథిల్ కుమార్ నైట్ వాచ్మన్గా పనిచేస్తున్నాడు. ఈ నెల 2న రాత్రి విధుల్లో ఉన్న సెంథిల్ కుమార్ కాంప్లెక్స్ లిఫ్ట్ వద్ద నిద్రపోయాడు. ఆ సమయంలో అక్కడికొచ్చిన 25 ఏళ్ల యువకుడు సెంథిల్ను బండరాయితో మోది తీవ్రంగా గాయపరిచాడు. అనంతరం అతడి వద్ద ఉన్న రూ. 1000, సెల్ఫోన్ లాక్కుని పరారయ్యాడు.ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఆధారంగా నిందితుడిని పుదుక్కోట్టై జిల్లా కర్బగకుడికి చెందిన రాజేశ్ కుమార్గా గుర్తించారు. అంతేకాదు, ఫిబ్రవరి 2, 3, 4 తేదీల్లో వరుసగా ముగ్గురు వాచ్మన్లను హత్యచేసి వారి నుంచి నగదు చోరీ చేసినట్టు నిర్దారించారు. అంతేకాదు, 2009లో తన సొంత గ్రామంలోనే నాలుగేళ్ల బాలుడిని, 2015లో ఓ వృద్ధురాలిని హతమార్చినట్టు తేలింది. శుక్రవారం కరంబకుడిలో నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. కేవలం మూడు వేల కోసం ఐదుగురిని హతమార్చినట్టు తెలిసి పోలీసులు విస్తుపోయారు. అతడు సైకో హంతకుడై ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/