ఢిల్లీ జామా మసీదులో భారీ నిరసన

న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ నేతలు నుపూర్ శర్మ, నవీన్ జిందాల్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ.. ఢిల్లీలోని జామా మసీదు వద్ద వందలాది మంది ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం మధ్యాహ్నం ప్రార్థనల తర్వాత ఒక్కసారిగా అనేక మంది నిరసన బాట పట్టారు. బీజేపీ నేతలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామంపై స్పందించిన మసీదు కమిటీ.. తాము ఎలాంటి ఆందోళనలకు పిలుపు ఇవ్వలేదని తెలిపింది. వీరంతా మజ్లిస్ పార్టీ చెందిన కార్యకర్తలుగా భావిస్తున్నామని తెలిపింది. ఈ ఆందోళన కార్యక్రమాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని మసీద్ కమిటీ పేర్కొంది. అప్రమత్తమైన పోలీసులు మసీదు వద్దకు చేరుకుని పరిస్థితిని అదుపు చేశారు.
కాగా, నిరసన ప్రదర్శనకు మసీదు కమిటీ పిలుపు ఇవ్వలేదని జామా మసీదు షాహి ఇమామ్ తెలిపారు. మసీదు ముందు నిరసన ప్రదర్శన చేపట్టినవారు ఎవరో తమకు తెలియదన్నారు. శుక్రవారం ప్రదర్శన చేపట్టాలని కొందరు గురువారం ప్లాన్ చేశారని, కానీ వాళ్లు మసీదు అనుమతి ఇవ్వలేదని షాహి ఇమామ్ తెలిపారు. ఆందోళన చేపట్టినవాళ్లు బహుశా ఎంఐఎం పార్టీ లేదా ఓవైసీ మద్దతుదారులై ఉంటారని ఆయన అన్నారు. నిరసన చేపడుతున్నవారికి తాము మద్దతు ఇవ్వడంలేదని ఆయన స్పష్టం చేవారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/