గడప గడపకు కార్యక్రమంలో మంత్రి అంబటిని నిలదీసిన మహిళ
గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేతలకు షాకులు మీద షాకులు ఇస్తున్నారు ప్రజలు. ఏ నేతని కూడా వదలకుండా అసలు ఏంచేసింది మీ ప్రభుత్వం అంటూ నిలదీస్తున్నారు. ప్రజలు ఏమి అడుగుతారో అని నేతలు భయపడుతూ వారి దగ్గరికి వెళ్తున్నారు. ఇంకొందరైతే ముందుగానే పార్టీ కార్యకర్తలతో మాట్లాడి పెట్టుకుంటున్నారు. ఇదిలా ఉంటె తాజాగా మంత్రి అంబటి రాంబాబు ను ఓ మహిళా నిలదీసింది.
బుధువారం పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ తరుణంలో ఓ మహిళా మంత్రిని నిలదీసింది. తన సోదరుడి పింఛన్ ఎందుకు తొలగించారంటూ ప్రశ్నించింది. టీడీపీ హయాంలో వికలాంగుడికి నెలనెలా పింఛన్ వచ్చేదని.. వైకాపా అధికారంలోకి వచ్చాక పింఛన్ తొలగించారని ఆవేదన వ్యక్తం చేసింది. దీంతో మంత్రి వాలంటీర్ ను అడుగగా..ఉద్దేశ్యపూర్వకంగా పింఛన్ నిలిపివేశారంటూ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ‘తొందరపడితే ఎలా ? తర్వాత వస్తుంది లే…’ అంటూ మంత్రి అక్కడినుంచి వెళ్లిపోయాడు.
ఇక జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని నియోజకవర్గ మహిళలు నిలదీశారు. జమ్మలమడుగు పరిధిలోని ఎర్రగుంట్లలో బుధవారం చేపట్టిన గడపగడపకు కార్యక్రమంలో సుధీర్ రెడ్డి పాలుపంచుకున్నారు. ఈ క్రమంలో గ్రామంలోని మహేశ్వరనగర్కు ఎమ్మెల్యే వెళ్లగా… బోరు బావి సమస్యను పరిష్కరించాలని స్థానిక మహిళలు ఎమ్మెల్యేను కోరారు. ఈ సందర్భంగా మహిళలంతా ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. మహిళలందరూ ప్రశ్నల వర్షం కురిపించడంతో ఎమ్మెల్యే సుధీర్రెడ్డి చెవులు మూసుకున్నారు. సమస్య పరిష్కరిస్తానంటూ అక్కడినుంచి వెళ్లిపోయారు.