మోర్బీ వంతెన బాధితులను పరామర్శించిన ప్రధాని

గుజరాత్ లోని మోర్బీలో కేబుల్ బ్రిడ్జి కూలి 141 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంపై సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ.. మంగళవారం మోర్బీలో పర్యటించారు. ముందుగా ఘటనాస్థలిని సందర్శించి పరిశీలించారు. ఆ తర్వాత హాస్పటల్ లో చికిత్స తీసుకుంటున్న బాధితుల వద్దకు చేరుకుని వారి కుటుంబాలను పరామర్శించారు. రెస్క్యూ ఆపరేషన్‌లో నిమగ్నమైన వారిని కూడా ప్రధాని మోడీ కలిశారు. ఆపరేషన్ గురించి ఆరా తీశారు.

అనంతరం ఎస్పీ కార్యాలయంలో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. మోర్బీలో రెస్క్యూ ఆపరేషన్ ను వేగవంతం చేయాలని కోరారు. కేబుల్ వంతెన ప్రమాదం జరిగిన తీరును, సహాయక చర్యలపై గుజరాత్‌ సీఎం భూపేంద్ర పటేల్‌, అధికారులు ప్రధాని మోదీకి వివరించారు. ఇక ఈ ఈ ప్రమాదంలో దాదాపు 141 మందివరకు మరణించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున మోడీ ఎక్స్‌గ్రేషియా ప్రకటించడం జరిగింది. అటు గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు రూ. 4 లక్షలు, గాయపడిన వారికి రూ 50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించింది.