ఓబీసీ జనాభా గణాంకాలను ప్రధాని వెల్లడించాలిః రాహుల్ గాంధీ
బెంగళూరుః కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం బీదర్లో జరిగిన ర్యాలీ ప్రసంగించారు. కర్ణాటకలో ప్రస్తుత బిజెపి సర్కార్ను 40 పర్సెంట్ కమిషన్ ప్రభుత్వమని ప్రజలే వ్యవహరిస్తున్నారని, ఈ పదాన్ని కాంగ్రెస్ పార్టీ వాడలేదని రాహుల్ పేర్కొన్నారు. అవినీతి ప్రభుత్వాన్ని సాగనంపి కాంగ్రెస్కు పాలనా పగ్గాలు అందించాలని ఓటర్లకు పిలుపు ఇచ్చారు. కర్నాటకలో తాము అధికారంలోకి వస్తే అవినీతిని పారదోలి పారదర్శక పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా, కర్నాటక అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార బిజెపికి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కమలం పార్టీకి గుడ్బై చెప్పారు.
ఓబీసీలకు నరేంద్ర మోడీ సారధ్యంలోని బిజెపి ప్రభుత్వం చేసింది శూన్యమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు. ఓబీసీలను అభివృద్ధి పధంలోకి తీసుకువెళ్లాలంటే ముందుగా వారి హక్కులను వారికి అందించాలని, ఓబీసీ జనాభా గణాంకాలను ప్రధాని వెల్లడించాలని కోరారు. ప్రధాని ఎన్నడూ ఈ పని చేయరని, ఎందుకంటే ఆయనకు ఓబీసీల సంక్షేమం పట్టదని దుయ్యబట్టారు.