ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల ప్రదానం
తొలి విడతగా 64 మందికి రాష్ట్రపతి అందజేత
New Delhi: ప్రతిష్టాత్మక ‘పద్మ’ పురస్కారాల ప్రదానం రాష్ట్రపతి భవన్లో సోమవారం సాయంత్రం ఘనంగా జరిగింది. తొలి విడతగా 64 మందికి అవార్డులను అందజేశారు. ఇద్దరికి ‘పద్మ విభూషణ్’, 8 మందికి ‘పద్మభూషణ్’, 54 మందికి ‘పద్మశ్రీ’ పురస్కారాలను రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అందజేశారు.
తెలుగు రాష్ట్రాల నుంచి ‘మహా సహస్రావధాని’ డాక్టర్ గరికపాటి నరసింహారావు, డాక్టర్ సుంకర వెంకట ఆదినారాయణరావు, ‘కిన్నెర’ వాయిద్యకారుడు దర్శనం మొగులయ్య, నాదస్వర విద్వాంసుడు గోసవీడు షేక్ హసన్ సాహెబ్(మరణానంతరం)కు ‘పద్మశ్రీ’ అవార్డులను అందజేశారు. దివంగత సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ తరపున ఆయన కుమార్తెలు కృతిక రావత్, తరిణి రావత్, , గీతా ప్రెస్ అధినేత దివంగత రాధేశ్యామ్ ఖేమ్కా తరఫున ఆయన కుమారుడు కృష్ణ కుమార్ ఖేమ్కా ‘పద్మ విభూషణ్’ పురస్కారాలు అందుకున్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత , మాజీ సీఎం గులాం నబీ ఆజాద్, ‘సీరం’ ఇన్స్టిట్యూట్ ఎండీ సైరస్ పూనావాలా, గుర్మీత్ బావా (మరణానంతరం), ఎన్.చంద్రశేఖరన్,రాజీవ్ మెహర్షి,సచ్చిదానంద స్వామి, దేవేంద్ర ఝఝరియా, రషీద్ ఖాన్ లకు ‘పద్మభూషణ్’ ప్రదానం చేశారు.
ఈనెల 28న రెండో విడత పురస్కారాల ప్రదానం
రెండో విడత ‘పద్మ’ అవార్డుల ప్రదానోత్సవం ఈ నెల 28వ తేదీన జరగనుంది. 4 ‘పద్మ విభూషణ్’, 17 ‘పద్మ భూషణ్’, 107 ‘పద్మశ్రీ ‘ పురస్కారాలు అందజేయనున్నారు. ఈ రెండు విడతల్లో 34 మంది మహిళలు, 10 మంది విదేశీయులు, ఎన్నారైలు ఉన్నారు. కాగా, 13 మందికి మరణానంతరం అవార్డులు బహూకరిస్తున్నారు.
తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/