రాజ‌ధాని కీవ్ ఇంకా త‌మ అధీనంలోనే ఉంది : అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ

బ్రిడ్జీల‌ను కూల్చేసి ర‌ష్యాను నిలువ‌రించామ‌ని వెల్ల‌డి

హైదరాబాద్: బాంబుల‌తో ర‌ష్యా విరుచుకుప‌డుతున్నా.. చిన్న దేశ‌మైన‌ప్ప‌టికీ ఉక్రెయిన్ ధైర్యంగా ర‌ష్యా దాడుల‌కు ఎదురొడ్డి నిలుస్తోంది. ఈ క్ర‌మంలో శుక్ర‌వారం సాయంత్రానికే ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్‌ను చుట్టుముట్టామ‌ని, ఏ క్ష‌ణంలో అయినా కీవ్‌ను త‌మ స్వాధీనంలోకి తీసుకుంటామ‌ని ర‌ష్యా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే తాజాగా ఉక్రెయిన్ అధ్య‌క్షుడు జెలెన్‌స్కీ ఓ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌ధాని కీవ్‌పై తాము ఇంకా ప‌ట్టు కోల్పోలేద‌ని, ఇప్ప‌టికీ కీవ్ త‌మ అధీనంలోనే ఉంద‌ని ఆయ‌న కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించారు.

ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ స‌హా ఆ దేశం మొత్తాన్ని స్వాధీనం చేసుకునేదాకా వెన‌క్కు త‌గ్గ‌రాద‌ని ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ త‌న సైన్యానికి పిలుపునిచ్చారు. పుతిన్ భావ‌న‌ను ఇట్టే ప‌సిగ‌ట్టిన జెలెన్‌స్కీ.. కీవ్‌లోకి ర‌ష్యా బ‌ల‌గాలు చొర‌బ‌డ‌కుండా వ్యూహం ర‌చించారు. న‌గ‌రం న‌లుదిక్కులా ఉన్న బ్రిడ్జిల‌ను కూల్చేయించి ర‌ష్యా సైన్యాన్ని ఆయ‌న అడ్డుకున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌స్తావించిన జెలెన్‌స్కీ.. కీవ్ పై తాము ఎంత‌మాత్రం ప‌ట్టు కోల్పోలేద‌ని, రాజ‌ధాని న‌గ‌రం ఇంకా త‌మ అధీనంలోనే ఉంద‌ని ప్ర‌క‌టించారు. ర‌ష్యా సైన్యాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధ‌ప‌డే ప్ర‌జ‌లు ముందుకు వ‌స్తే వారికి ఆయుధాలు ఇస్తామ‌ని కూడా జెలెన్‌స్కీ మ‌రోమారు ప్ర‌క‌టించారు.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/national/