నేడు భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామిని దర్శించుకోనున్న రాష్ట్రపతి

హైదరాబాద్ః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిది కోసం రాష్ట్రానికి విచ్చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె బుధవారం భద్రాద్రి, రామప్ప ఆలయాలను సందర్శించనున్నారు. భద్రాద్రి శ్రీసీతారామ చంద్రస్వామిని, రామప్ప రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. కేంద్ర ప్రభుత్వం ప్రసాద్ స్కీం కింద మంజూరు చేసిన నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు రాష్ట్రపతి భూమి పూజ చేస్తారు. రాష్ట్రపతి టూర్ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు.
కాగా, రాష్ట్రపతి ముందుగా హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్తారు. అక్కడి నుంచి ఉదయం 10.10 గంటలకు భద్రాచలం పబ్లిక్ స్కూల్కు హెలికాఫ్టర్లో చేరుకుంటారు. 10.30 గంటలకు శ్రీసీతారామచంద్రస్వామిని దర్శించుకుంటారు. తర్వాత ప్రసాద్ స్కీం నిధులు రూ.41.38 కోట్లతో చేపట్టే పనులకు ఆమె భూమి పూజ చేస్తారు. అనంతరం వీరభద్ర ఫంక్షన్ హాల్లో జరిగే గిరిజన పూజారుల సమ్మేళనంలో పాల్గొంటారు. లంచ్ తర్వాత మధ్యాహ్నం 1.35కు భద్రాద్రి నుంచి ములుగు జిల్లాలోని రామప్ప ఆలయానికి వెళ్తారు. రాష్ట్రపతి రాక నేపథ్యంలో బుధవారం ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేశారు. భద్రతా కారణాలతో భద్రాచలం రామవారధిపై ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు రాకపోకలు నిషేధించారు. భద్రాచలం, సారపాకల్లో 144 సెక్షన్ విధించి స్కూళ్లకు సెలవు ప్రకటించారు.
భద్రాచలం నుంచి ప్రత్యేక హెలికాఫ్టర్లో మధ్యాహ్నం 2.20 గంటలకు రాష్ట్రపతి ముర్ము రామప్ప ఆలయానికి చేరుకుంటారు. హెలిప్యాడ్ నుంచి బ్యాటరీ కారులో రామప్ప టెంపుల్ ప్రధాన గేటు వద్దకు వస్తారు. ఆలయంలో రామలింగేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం రూ.62 కోట్లతో ప్రసాద్ స్కీం కింద చేపట్టబోయే పనులను, రూ.15 కోట్లతో చేపట్టబోయే కామేశ్వర ఆలయ పున:నిర్మాణ పనులను ప్రారంభిస్తారు. ఆ తర్వాత అక్కడే తన కోసం తయారు చేసిన గ్రీన్ హౌస్ లో రాష్ట్రపతి కాసేపు సేద తీరుతారు. రాష్ట్రపతి కోసం ప్రత్యేకంగా రెండు గిరిజన నృత్యాలను ప్రదర్శించనున్నారు. మధ్యాహ్నం 4 గంటలకు రాష్ట్రపతి తిరిగి హైదరాబాద్ కు బయలుదేరుతారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/