ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దుః రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

విలువలతో కూడిన విద్యావ్యవస్థకు, సాంస్కృతిక సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలన్న రాష్ట్రపతి

president-draupadi-murmu-visit-keshav-memorial-educational-society-narayanguda

హైదరాబాద్‌ః విలువలతో కూడిన విద్యావ్యవస్ధకు, సాంస్కృతిక విలువల సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్ధులకు సూచించారు. శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్ కు వచ్చిన రాష్ట్రపతి మంగళవారం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థల సొసైటీ విద్యార్థులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్ధులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. విద్య అనేది దేశ నిర్మాణానికి పునాది అని, ప్రతి వ్యక్తి పూర్తి సామర్థ్యాన్ని వెలికితీయడానికి ఇది కీలకం అని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా మహిళలు చదువులో రాణించాలన్నారు. ఒక మహిళ విద్యనభ్యసిస్తే మొత్తం కుటుంబాన్ని విద్యావంతులను చేస్తారన్న మహాత్మాగాంధీ మాటలను రాష్ట్రపతి గుర్తు చేశారు.

మన విశిష్ట సంస్కృతే మన ప్రత్యేక గుర్తింపు అన్నారు. ఎంత ఎదిగినా మన మూలాలు, సంస్కృతిని మరవొద్దని విద్యార్థులకు సూచించారు. గ్రామమైనా, ఏజెన్సీ అయినా సొంత సంస్కృతిని చూసి గర్వపడాలని పిలుపునిచ్చారు.గ్రామం, ఏజెన్సీ నుంచి వచ్చామనే ఆత్మనూన్యతను రానీయొద్దని సూచించారు. మన దేశంలో ప్రతి ఊరికి గ్రామ దేవత రక్షణగా ఉందన్న రాష్ట్రపతి.. మహిళలు అన్ని రంగాల్లో అవకాశాలను అందిపుచ్చుకుంటున్నారని పేర్కొన్నారు. మన రాజ్యాంగం మహిళలకు అనేక అవకాశాలు కల్పించిందని, తల్లిదండ్రులు చిన్నతనం నుండే పిల్లలకు విలువల గురించి నేర్పించాలని కోరారు. అన్ని విషయాల్లో అమెరికాతో పోల్చుకోవద్దని, భారత్‌లో ఉన్న జనాభా అమెరికాలో లేదన్నారు. భారత్‌లో ఉన్నన్ని కులాలు, భాషలు, వైవిధ్యం అమెరికాలోని లేవని స్పష్టం చేశారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి సత్యవతిరాథోడ్‌ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్రపతి కేశవ్‌ మెమోరియల్‌లో ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు.

బాలికలకు విద్య, అవకాశాలలో సమాన ప్రవేశం కల్పించినప్పుడు వారు అబ్బాయిల కంటే ఎక్కువ సాధించారని ముర్ము చెప్పారు. ఇక మన పూర్వీకులు వేసిన పునాదులపై మన దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకువెళ్లేలా చూడాల్సిన బాధ్యత భారతదేశంలోని యువకులందరికీ ఉందని అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ కు గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉందని రాష్ట్రపతి అన్నారు. ‘గొప్ప సాంస్కృతిక వారసత్వం, విభిన్న జనాభా కలిగిన నగరం హైదరాబాద్ . ఇది విభిన్న ఆలోచనలు, దృక్కోణాల సమ్మేళనంగా మారిపోయింది. ఈ వైవిధ్యమే హైదరాబాద్ ప్రధాన బలం. అభివృద్ధికి కేంద్రంగా నగరం విజయానికి దోహదపడింది’ అని అభిప్రాయపడ్డారు. ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’లో భాగంగా హైదరాబాద్ విమోచన 75వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి, గవర్నర్ తమిళిసై సౌందర రాజన్, రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/andhra-pradesh/