పిబిఎల్‌ ఫైనల్స్‌ బెంగళూరులో కాదు

వేదికను హైదరాబాద్‌కు మార్చిన నిర్వాహకులు

Premier Badminton League 2020
Premier Badminton League 2020

హైదరాబాద్‌: ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌(పిబిఎల్‌) ఐదో సీజన్‌ ముందుగా విడుదల చేసిన షెడ్యూల్‌ ప్రకారం బెంగళూరులో నిర్వహించాల్సి ఉంది. అయితే ఇప్పుడు అందులో మార్పులు చేసి బెంగళూరు నుంచి వేదికను హైదరాబాద్‌కు మార్చారు. ఈ ప్రీమియర్‌ లీగ్‌ జనవరి 20 న ప్రారంభం కానుంది. ఈ అంచె పోటీలు ఫిబ్రవరి 5 నుంచి 6 వరకు.. ఆ తర్వాత ఫిబ్రవరి 7,8 తేదీల్లో రెండు సెమీఫైనల్స్‌తో పాటు 9 న జరిగే ఫైనల్‌ను బెంగళూరులోని శ్రీ కంఠీరవ ఇండోర్‌ స్టేడియంలో జరిగేలా రూపొందించారు. అయితే, అదే సమయంలో స్టేడియం అందుబాటులో ఉండడం లేదని అక్కడ మ్యాచ్‌లను నిర్వహించడం కష్టమని బెంగళూరు రాప్టర్స్‌ జట్టు ట్విట్టర్‌‌లో ట్వీట్ చేసింది. దీంతో బెంగళూరు అంచె మ్యాచ్‌లతోపాటు సెమీఫైనల్స్, ఫైనల్‌ను హైదరాబాద్‌కు తరలిస్తున్నట్లు ప్రీమియర్‌ బ్యాడ్మింటన్‌ లీగ్‌ (పీబీఎల్‌) నిర్వాహకులు అధికారిక ప్రకటన చేశారు. అసలు షెడ్యూల్ ప్రకారం జనవరి 29 నుండి ఫిబ్రవరి 4 వరకు హైదరాబాద్ మ్యాచ్‌లను నిర్వహించాల్సి ఉంది. అయితే, కొత్త షెడ్యూల్ ప్రకారం మరో 15 మ్యాచ్‌లకు అదనంగా హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. మొత్తంగా తాజా సీజన్‌లో హైదరాబాద్‌ ఆతిథ్యం ఇచ్చే మ్యాచ్‌ల సంఖ్య పెరగడం బ్యాడ్మింటన్ అభిమానులకు పండుగే.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/