అక్టోబర్ 2నుంచి పాదయాత్ర : ప్రశాంత్ కిషోర్
3000 కిలోమీటర్ల పాదయాత్ర చేయనున్న ప్రశాంత్ కిషోర్
న్యూఢిల్లీ: ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ మూడు వేల కిలో మీటర్ల పాదయాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 2వ తేదీన ఈ పాదయాత్ర ప్రారంభం కానుంది.తన పాదయాత్రలో వీలైనంత మందిని కలవనున్నట్లు ఆయన వెల్లడించారు. బీహార్లో ఇప్పుడేమీ ఎన్నికలు లేవని, ఇక ఇప్పట్లో రాజకీయ పార్టీని స్థాపించే ప్రణాళిక ఏదీ లేదన్నారు. రాబోయే మూడు లేదా నాలుగేళ్లు ప్రజలకు చేరువయ్యే పనిలో నిమగ్నం కానున్నట్లు చెప్పారు. కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన నుంచి వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే బీహార్ను బలోపేతం చేసేందుకు అంకితం కానున్నట్లు ఆయన వెల్లడించారు.
కాగా, సీఎం నితీశ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలో బిహార్కు ఒరిగిందేమీ లేదని అన్నారు. బిహార్ అభివృద్ధి చెందాలంటే సరికొత్త ఆలోచనలు కావాలని పిలుపునిచ్చారు పీకే. రాష్ట్రాభివృద్ధికి పాటుపడాలనుకునేవారు తనతో కలిసి ముందుకురావాలని అన్నారు. 90 శాతం మంది ప్రజలు బిహార్లో మార్పు కోరుకుంటున్నారని పట్నాలో విలేకరుల సమావేశంలో వెల్లడించారు ప్రశాంత్ కిశోర్. జన్ సురాజ్తో ప్రజలకు చేరువవుతానని స్పష్టం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/