యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడానికి ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ 2 కిలోల బంగారం విరాళం

యాదాద్రి విమాన గోపురం స్వర్ణతాపడం కోసం సీఎం కేసీఆర్ ముందుగా తన వంతుగా కిలో 16 తూలాల బంగారం విరాళంగా ప్రకటించారు. అనంతరం ప్రజలు స్వామివారికి విరాళాలు ప్రకటించాలని విజ్ఞప్తిచేశారు. సీఎం కేసీఆర్‌ స్ఫూర్తితో పలు రంగాల ప్రముఖులు విరాళాలు ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు. తాజాగా ప్ర‌ణీత్ గ్రూప్ ఎండీ న‌రేంద్ర కుమార్ కామ‌రాజు 2 కిలోల బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు. చెన్నూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ కిలో బంగారం, జ‌ల‌విహార్ ఎండీ రామ‌రాజు కిలో బంగారాన్ని యాదాద్రికి విరాళంగా ప్ర‌క‌టించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు బంగారం విరాళంగా ప్ర‌క‌టించిన వారు ఎవరంటే ..

సీఎం కేసీఆర్ – 1.16 కిలోలు
హెటిరో గ్రూప్ ఆఫ్ కంపెనీస్ చైర్మ‌న్ పార్థ‌సార‌థి రెడ్డి – 5 కిలోలు
మంత్రి మ‌ల్లారెడ్డి – 2 కిలోలు
ఎమ్మెల్యే మ‌ర్రి జ‌నార్ధ‌న్ రెడ్డి – 2 కిలోలు
మంత్రి హ‌రీశ్‌రావు – 1 కిలో
న‌మ‌స్తే తెలంగాణ – తెలంగాణ టుడే సీఎండీ దీవ‌కొండ దామోద‌ర్ రావు – 1 కిలో
కావేరీ సీడ్స్ భాస్క‌ర్ రావు – 1 కిలో
జీయ‌ర్ పీఠం – 1 కిలో
ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు – 1 కిలో
ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ – 1 కిలో
ఎమ్మెల్యే హ‌నుమంత‌రావు – 1 కిలో
ఎమ్మెల్యే కృష్ణారావు – 1 కిలో
ఎమ్మెల్యే కేవీ వివేకానంద – 1 కిలో
ఎమ్మెల్సీ న‌వీన్ కుమార్ – 1 కిలో
ఎంపీ రంజిత్ రెడ్డి – 1 కిలో
క‌డ‌ప వ్యాపార‌వేత్త జ‌య‌మ్మ – 1 కిలో

ఇక యాదాద్రి దివ్యక్షేత్రం పునఃప్రారంభ తేదీని కేసీఆర్ మంగళవారం ప్రకటించారు. చిన్నజీయర్‌ స్వామి ఆధ్వర్యంలో విద్వత్‌ సభ, సిద్ధాంతుల సభ నిర్ణయించిన ముహూర్తం ప్రకారం వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన మహాకుంభ సంప్రోక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. మార్చి 21న అంకురార్పణతో ఎనిమిది రోజులపాటు మహా సుదర్శన యాగం నిర్వహించనున్నట్టు చెప్పారు. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్‌ ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన అనంతరం ఆలయ పున:ప్రారంభ తేదీలను ప్రకటించారు.