ఆందోళనకరం ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం

ముఖర్జీకి బ్రెయిన్ సర్జరీ..ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉంచి చికిత్స

Pranab Mukherjee

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కరోనా సోకిన  సంగతి తెలిసిందే. ప్రణబ్ ముఖర్జీకి గత రాత్రి బ్రెయిన్ సర్జరీ జరిగింది. ఆయన మెదడులో రక్తం గడ్డకట్టిందని తెలుసుకున్న వైద్యులు, ఇతర పరీక్షలు నిర్వహించగా, ఆయనకు కరోనా కూడా సోకినట్టు గుర్తించారు. మెదడుకు శస్త్రచికిత్స చేయగా, ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్టు తెలుస్తోంది. శస్త్రచికిత్స విజయవంతమైనా, 84 సంవత్సరాల వయసులో ఉన్న ఆయనకు, కరోనా వైరస్ కారణంగా ఇతర అవయవాల పనితీరు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఆయనను వెంటిలేటర్ పై ఉంచామని, ప్రత్యేక వైద్య బృందం అనుక్షణం పరిశీలిస్తోందని న్యూఢిల్లీలో ఆర్మీ నిర్వహణలో ఉన్న ఆర్ అండ్ ఆర్ ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. కాగా ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడాలని, ఆయన త్వరగా కోలుకోవాలని పలువురు ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా కోరుకుంటున్నారు. ప్రణబ్ ముఖర్జీ త్వరగా కోలుకోవాలని, ఆయన త్వరగా కోలుకుంటారన్న నమ్మకం తనకుందని కేంద్ర మంత్రి పీయుష్ గోయల్ వ్యాఖ్యానించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/