మరి ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ ప్రస్తావన?
అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదు.. ప్రకాశ్ రాజ్
హైదరాబాద్: మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష ఎన్నిక బరిలో ప్రకాశ్రాజ్ నిన్న 27 మందితో తన ప్యానల్ను ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మీడియా సమావేశంలో మాట్లాడారు.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్ష పదవికి పోటీ చేయాలన్న నిర్ణయం ఒక్కరోజులో తీసుకున్నది కాదని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తాను పోటీ చేయాలని తీసుకున్న నిర్ణయం బాగా ఆలోచించి తీసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తాను ఏడాది నుంచి ప్యానల్ ఏర్పాటుపై ఆలోచన చేసినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో అందరూ అందరికీ కావాల్సిన వారేనని ప్రకాశ్ రాజ్ చెప్పారు. తనను లోకల్.. నాన్ లోక్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని చెప్పారు. కళాకారులందరూ లోకల్ కాదని యూనివర్సల్ అని వ్యాఖ్యానించారు. అలాంటప్పుడు తాను నాన్ లోకల్ ఎలా అవుతా? అని ప్రశ్నించారు. అకారణ శత్రుత్వం వద్దని చెప్పారు.
అవార్డులు వచ్చినప్పుడు నాన్ లోకల్ అనే ప్రస్తావన ఎందుకు రాలేదు? అని ప్రకాశ్ రాజ్ నిలదీశారు. అలాగే, రెండు గ్రామాలను దత్తత తీసుకున్నప్పుడు నన్ను నాన్ లోకల్ అని అనలేదని చెప్పారు. మరి ఇప్పుడు ఎందుకు నాన్ లోకల్ ప్రస్తావన? అని ప్రశ్నించారు. ఆవేదనతో పుట్టిన సినిమా బిడ్డల ప్యానల్ ఇదని తెలిపారు. కేవలం తనకు పరిచయం ఉందన్న కారణంతో తాను ఓట్లు అడగడం లేదని.. మా అభివృద్ధికి ప్రణాళికలు రచిస్తామని, అందరూ ఆశ్చర్యపలేడా పనిచేస్తామని ప్రకాశ్ రాజ్ చెప్పుకొచ్చారు. మా భవనం ఎలా కడతామో ముందే చెబుతామని ప్రకటించారు. తాను పదవి కోసం రాలేదని పనిచేయడానికి వచ్చానని అన్నారు. తాను చిన్న తప్పు చేసినా ప్రశ్నించే వారు తన ప్యానల్లో ఉన్నారని తెలిపారు. తనకు ప్రశ్నించే వారు, కష్టపడి పని చేసే వారు కావాలని చెప్పారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/