ప్రజావాక్కు
సమస్యలపై ప్రజాగళం
కులాల కలుపు తీయగలరా?: -వీరుభొట్ల పేరయ్యశాస్త్రి, విజయవాడ
కులాల కలుపు మొక్కలను తీసివేయాలంటూ రాష్ట్ర ముఖ్య మంత్రి పిలుపునివ్వటం సంతోషం.కానీ, ప్రత్యేకీకరణల కోసం రాష్ట్ర ప్రభుత్వం దాదాపు ప్రతిదరఖాస్తులోనూ ప్రజల కులా లను అడుగుతోంది.
ఇక మానసికంగా వేరే కులంలోని వారు భౌతికంగా హిందూ వేషధారణతో హిందూధర్మంలో వెనుక బడిన, దళిత కులాలుగా చెలామణి అవుతున్న వారి సంఖ్య లక్షల్లో ఉన్నది.
రాజకీయ పక్షాలు వివిధరకాల సామాజిక సమీ కరణలు, స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల మధ్య చిచ్చుపెడుతున్నాయి.
దీనికి కులం ముసుగుతగిలిస్తున్నారు. ప్రజాప్రతినిధులుగా కొన్ని స్థానాలను కొన్ని కులాలకు కేటా యించడం మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న లౌకికవాదం.
ఇలా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు ఆడుతున్న కులసమరంతో సామాన్య ప్రజలు సమిధలవుతున్నారు. కనుక రాజకీయ పక్షా లు ముందుగా తమను తాము సంస్కరించుకోవాలి.
కూరగాయల ధరలను తగ్గించాలి: -సి.ప్రతాప్, శ్రీకాకుళం
బజారులో కూరగాయల ధరలు ఆకాశానంటుతూ సామాన్యుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి.
ఉల్లి, బంగాళదుంప, ఆన పకాయవంటి మధ్యతరగతి ప్రజలకూరల ధరలు అకస్మాత్తుగా పెరిగిపోయాయి. మరొకపక్క నిత్యావసర సరుకుల ధరలు ప్రతీవారం పెరుగుతూనే ఉన్నాయి.
రైతుబజార్ల ద్వారా తగ్గిం పు ధరలకు సరుకులు అందిస్తామన్న ప్రభుత్వ హామీ అమలు కావడం లేదు.
ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, డీజిల్, పెట్రోల్ ధరలను కూడా పెంచేయడం మూలిగే నక్కపై తాటికాయపడ్డట్లు అయింది.
ప్రభుత్వం కరోనా నేపథ్యంలో ఉద్యోగులకు డిఏకూడా పెంచడంలేదు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఎప్పుడు ఊడతాయో తెలీయడంలేదు.
50 శాతం జీతాలుఅందుకోవడం గగనంగా మారింది.
అంగన్వాడిలో సన్నబియ్యం: – ముచ్కుర్ సుమన్గౌడ్, నిజామాబాద్
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అంగన్వాడి సెంటర్లలో పిల్లలు, గర్భిణీ స్త్రీలకు పోషకాహారంగా ఇస్తున్న ఆహారం నాణ్య మైన ఆహారం పెట్టాలి.
సన్నబియ్యంతో ఆహారం పెట్టాలి. నేరంచేసి శిక్ష అనుభవిస్తున్న ఖైదీలకు రాష్ట్ర జైలులో సన్న బియ్యంతో ఆహారం పెడుతున్నారు.
అలానే దేశ భవిష్య త్తు రేపటి పౌరులు పిల్లలు కాబట్టి వారి ఆరోగ్యం దృష్టి లో ఉంచుకొని నాణ్యమైన ఆహారం అందించాలి.
పాకిస్థాన్కు బుద్ధిచెప్పాలి: -సి.హెచ్.సాయిరుత్విక్, నల్గొండ
కాశ్మీర్పై ఇటీవల ఐరాసలో పాకిస్థాన్ విషప్రచారాన్ని భారత్ సమర్ధ్థవంతంగా తిప్పికొట్టి తనసత్తాను చాటింది.
అంతేకాకుండా గత మూడు దశాబ్దాలలో పాకిస్థాన్ ఉగ్రవాద చర్యలను ప్రధాని నరేంద్రమోడీ గణాంకాలలో వివరించడంతో అంత ర్జాతీయ సమాజం కూడా పాకిస్థాన్ ప్రచారాన్ని విశ్వసించలేదు.
చైనా తప్ప ఒక్క దేశం కూడా పాకిస్థాన్కు మద్దతు పలకలేదు. చివరకు అరబ్ దేశాలు కూడా కాశ్మీర్ సమస్త ద్వైపాక్షిక సమస్య మాత్రమేనని, ఇతర దేశాలు ఇందులో తలదూర్చడం సరికాదని స్పష్టంచేయడం ఉగ్రవాదవ్యతిరేక ప్రచారంలో అంతర్జాతీయంగా మోడీ ప్రభుత్వానికి లభించిన ఘన విజయం.
అనేక అంతర్జాతీయ ప్రసార మాధ్యమాల పాకిస్థాన్కు అనుకూల ప్రచారం చేసినా చివరకు ధర్మానికే విజయం లభించింది.
విద్యుత్ వాహనాలతో కాలుష్యానికి చెక్:- ఎం.కనకదుర్గ, తెనాలి,గుంటూరుజిల్లా
విద్యుత్వాహన తయారీ రంగానికి ఊపునిచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ఎలక్ట్రిక్వెహికిల్,ఎనర్జీ స్టోరేజి పాలసీ- 2020ను అమలుచేయడం హర్షణీయం.
వచ్చే రెండేళ్లలో రెండు లక్షల ద్విచక్ర వాహనాలు,30వేల ఆటోలు, ఐదువేల కారులు, 500 ఎలక్ట్రిక్ బస్సులు తయారీ లక్ష్యం ఇత్యాది చర్యల వలన తయారీ జోరందుకోవడం ఖాయం.
2030కల్లా 100శాతం కమర్షియల్ వాహనాలు విద్యుత్ వాహ నాలుగా మారితే పర్యావరణ కాలుష్యం కూడా తగ్గుతుంది.
నీచ రాజకీయాలు: -మిథునం, హైదరాబాద్
దుబ్బాక అసెంబ్లీ స్థానాన్ని దక్కించుకోవాలని టిఆర్ఎస్, బిజెపి నాయకులు తీవ్రంగా ప్రయత్నించారు.
నోట్ల కట్టల వ్యవహారం, బిజెపి కార్యకర్త ఆత్మహత్య ప్రయత్నం వంటి వాటిని తెరపైకి తెచ్చి ఆ రెండు పార్టీల నాయకులు పరస్పరం విమర్శించుకున్నారు.
దేశం మొత్తం దుబ్బాక వైపు చూసేలా చేశారు.
నిజానికి దుబ్బాకలో టిఆర్ఎస్ ఓడినం త మాత్రాన ఆ పార్టీకి జరిగే నష్టమేమీ ఉండదు. బిజెపి గెలిచినా సాధించేదేమీ ఉండదు.
తాజా తెలంగాణ వార్తల కోసం : https://www.vaartha.com/telangana/