షర్మిల పార్టీకి సలహాదారులుగా ప్రభాకర్‌రెడ్డి, ఉదయసిన్హా

షర్మిలకు మద్దతు పలికిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య

హైదరాబాద్‌: వైఎస్‌ షర్మిల తన కొత్తగా పార్టీ నిర్మాణంపై ఇప్పటికే పలువురు నేతలు ఆమెను కలిశారు. మరోవైపు పార్టీ సలహాదారులుగా మాజీ ఐఏఎస్ అధికారి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఐపీఎస్ అధికారి ఉదయసిన్హాలను నియమించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో సీఎంవోలో అడిషనల్ సెక్రటరీగా ప్రభాకర్ రెడ్డి పని చేయగా, సీఎస్ఓగా ఉదయసిన్హా పని చేశారు. మరోవైపు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ బ్రదర్ షఫీ కూడా షర్మిల పార్టీలో చేరనున్నారు. పార్టీ నేతలు, కార్యకర్తలను తన ఉత్తేజపూరిత ప్రసంగాలతో ఆయన మోటివేట్ చేయనున్నట్టు సమాచారం. ఇంకోవైపు మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య షర్మిలను కలిసి, ఆమెకు మద్దతు పలికారు.

తెలంగాణలో ఆంధ్రవాళ్ల పార్టీలు ఎందుకని పలువురు నేతలు ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. పోరాడి సాధించుకున్న తెలంగాణలో మళ్లీ ఆంధ్రోళ్ల పెత్తనం ఎందుకని అంటున్నారు. ఈ నేపథ్యంలో, తాను ‘తెలంగాణ కోడలు’ అని ప్రకటించేందుకు షర్మిల సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ ఇంటి కోడలిగా తాను తెలంగాణకే చెందుతానని చెపుతూ ఆమె ప్రజల్లోకి వెళ్లనున్నట్టు సమాచారం.


తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/