మునుగోడు లో రాజగోపాల్ కు అనుకూలంగా పోస్టర్లు

మునుగోడు లో ఇప్పటివరకు బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ కు వ్యతిరేకంగా పోస్టర్లు వెలువడం వార్తల్లో నిలిచాయి. కానీ ఇప్పుడు ఆయన కు అనుకూలంగా పోస్టర్లు వెలిశాయి. సంస్థాన్ నారాయణపురంలో రాజగోపాల్ రెడ్డికి అనుకూలంగా సోమవారం ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ‘ఫలిస్తున్న రాజన్న రాజీనామా.. కోమటిరెడ్డి రాజీనామా చేసి ఉపఎన్నికలను తీసుకురావడం ద్వారా ప్రతీ గ్రామానికి రూ.20 లక్షల నిధులు వచ్చాయి. నీ ధిక్కారంతో మునుగోడు ప్రజల కల సాకారమవుతుంది. చౌటుప్పల్‌ కేంద్రంలో 5 డయాలసిస్ యూనిట్లు మంజూరు అయ్యాయి. చేనేత బీమా ప్రకటించారు’ అంటూ పోస్టర్లు వెలిశాయి.

ఇటీవల రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా గోడలపై పోస్టర్లు రాత్రికి రాత్రి వెలిసిన సంగతి తెలిసిందే. రూ.18 కోట్ల కాంట్రాక్ట్ వ్యవహారానికి సంబంధించి ‘కాంట్రాక్ట్ పే’ అంటూ ఆయనకు వ్యతిరేకంగా రాత్రికి రాత్రి పలు మండలాల్లో దర్శనం ఇచ్చాయి. మునుగోడు ప్రజలరా.. మేము మోసపోయయం.. మీరు మోసపోకండి’ అంటూ హుజూరాబాద్, దుబ్బాక ప్రజలు చెప్పినట్లుగా ఫ్లెక్సీలు ఇటీవల గుర్తు తెలియని వ్యక్తులు ఏర్పాటు చేశారు. మునుగోడు నిన్ను క్షమించదు. కాంట్రాక్ట్ కోసం తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మోసం చేసిన ద్రోహివి’ అంటూ అగంతకులు గతంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేసిన దగ్గర నుంచి ఆయనకు యాంటీగా ఫ్లెక్సీల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇక ఇప్పుడు రాజగోపాల్ కు సానుకూలంగా పోస్టర్లు వెలిశాయి.