తెలంగాణలో పీఎఫ్ఐ కుట్ర.. అప్రమత్తమైన ఇంటెలిజెన్స్‌ అధికారులు

popular-front-of-india-will-attack-on-rss-and-hindu-organisations

హైదరాబాద్‌ః పీఎఫ్ఐ కార్యకర్తల దాడులపై తెలంగాణ ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ అప్రమత్తమైంది. కేరళ, తమిళనాడులో ఆర్ఎస్ఎస్, హిందూ కార్యకర్తలపై దాడులు చేసేందుకు పీఎఫ్ఐ కుట్ర చేసింది.. అక్కడి పోలీసులు దాన్ని భగ్నం చేశారు. ఈ క్రమంలో తెలంగాణలో కూడా పీఎఫ్ఐ దాడులు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు పీఎఫ్ఐ అనుసంబంధ సంస్థలపై నిఘా పెట్టాలని రాష్ట్ర పోలీసులకు ఇంటెలిజెన్స్ అధికారులు సూచించారు. శాంతిభద్రతలకు విఘాతం జరగకుండా ఉండేలా పోలీస్ అధికారులు నిఘా పెట్టాలని.. ఇంటెలిజెన్స్ ఆదేశాలు ఇచ్చింది. దీంతో రాష్ట్రంలోని ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, హిందు ధార్మిక సంస్థల ప్రతినిధులకు పోలీసులు అలర్ట్ ఇచ్చారు.

కాగా, గత నెలలో (సెప్టెంబర్) ఎన్ఐఏ అధికారులు దేశ వ్యాప్తంగా పలు చోట్ల దాడులు నిర్వహించి.. పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేశారు. ఈ క్రమంలో హైదారాబాద్ పాతబస్తీలో ఉన్న పీఎఫ్ఐ కార్యాలయాన్ని అధికారలు సీజ్ చేశారు. విదేశాల నుంచి నిధులు అందుకుంటున్న పీఎఫ్‌ఐ ప్రతినిధులు.. మతపరమై గొడవలు సృష్టించేందుకు వాటిని వినియోగిస్తున్నట్లు ఎన్ఐఏ దర్యాప్తులో తేలింది. దేశవ్యాప్తంగా పలువురు పీఎఫ్ఐ కార్యకర్తలను అరెస్టు చేసిన ఎన్‌ఐఏ అధికారులు వాళ్ల నుంచి కీలక సమాచారం సేకరించారు. పీఎఫ్ఐని నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/national/