ఉత్తమ్‌ పై పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు

Ponnam Prabhakar
Ponnam Prabhakar

హుజురాబాద్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కనీసం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయింది. ఈ ఘోర పరాజయం ఫై కాంగ్రెస్ అధిష్టానం టీపీసీసీ నాయకులతో శనివారం సమీక్ష నిర్వహించింది. ఈ సందర్భంగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై ఎంపీ పొన్నం ప్రభాకర్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. సమన్వయ లోపమే పార్టీ ఘోర ఓటమికి కారణం అంటూ పొన్నం సమీక్షలో ఆవేదన వ్యక్తం చేశారు.

ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోదరుడు (కజిన్‌) కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ ఇప్పించుకున్నారంటూ పొన్నం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాగే కొనసాగితే, వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్‌ తుడిచిపెట్టుకుపోవడం ఖాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కొందరు నాయకులు అడ్డుతగలడంతో దమ్ముంటే పార్టీ నుంచి తనను సస్పెండ్‌చేయాలంటూ పొన్నం సవాల్‌ విసిరారు.

ఈ సమావేశంలో టీ కాంగ్రెస్ ఇంచార్జ్ మాణిక్యం ఠాగూర్, ఏఐసిసి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాసన్, టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మధుయాష్కీ, షబ్బీర్‌ అలీ, శ్రీధర్‌బాబు, జీవన్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌, వి. హనుమంతరావు, సీతక్క పాల్గొన్నారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులతో పాటు హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ ఓటమి, అభ్యర్థికి అతి తక్కువ ఓట్లు రావడంపై ప్రధానంగా చర్చించారు. దేశంలో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ మంచి ఫలితాలు సాధించగా.. హుజూరాబాద్‌ బైపోల్‌లో మాత్రం ఘోరంగా ఓడిపోయింది. దాంతో రాష్ట్ర నాయకులపై కాంగ్రెస్‌ హైకమాండ్‌ సీరియస్‌ అయింది.