సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన బాబు ఆచూకీ లభ్యం

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో కిడ్నాప్‌కు గురైన బాబును గంట వ్యవధిలోనే పోలీసులు ఛేదించారు. బాబు కిడ్నాప్‌కు గురైన సమాచారాన్ని అందుకున్న రైల్వే పోలీసులు.. వెంటనే రంగంలోకి దిగి సీసీ ఫుటేజ్ ఆధారంగా.. బాబును అపహరించిన మహిళను గుర్తించి, ఆమె నుండి బాబు ను సురక్షితంగా తీసుకొచ్చి , తల్లిదండ్రులకు అప్పగించారు.

వివరాల్లోకి వెళ్తే..

శుక్రవారం ఉదయం ఓ ఒంటరి మహిళ గుంటూరు నుంచి సికింద్రాబాద్ కు బాబుతో వచ్చింది. రైల్వే స్టేషన్‌లో ఒంటరిగా మహిళ బాబుతో ఉండటాన్ని గమనించిన మరో మహిళ ఆమెతో కలిసి ఉంటూ.. బాబుకి బిస్కెట్లు ఇచ్చి మచ్చిక చేసుకుంది. తల్లి వాష్ రూమ్‌కి వెళ్లగానే వెంటనే మహిళ బాబును తీసుకుని పరారైంది. వాష్ రూమ్ నుంచి వచ్చిన మహిళకు తన బాబు, పక్కనే ఉన్న మహిళ కనిపించకపోవడంతో వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గాలించడం మొదలుపెట్టారు. సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు బాబును కిడ్నాప్ చేసిన మహిళ కదలికల ఆధారంగా ఆమె ఎక్కిన ఆటోను గుర్తించారు. ఆ ఆటోను కవాడీగుడలో పోలీసులు ఛేదించారు. అక్కడ స్థానికుల సమాచారంతో పోలీసులు సదరు మహిళను గుర్తించి బాబును మహిళ నుంచి క్షేమంగా తల్లి వద్దకు చేర్చారు. కిడ్నాప్ కేసును కేవలం గంట వ్యవధిలోనే పోలీసులు ఛేదించడంపై అంత ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నారు.