పంజాగుట్ట లో కారులో తరలిస్తున్న రూ.70 లక్షలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా నగదు పట్టుబడుతున్నాయి. ఇప్పటికే అనేక ప్రాంతాల్లో పోలీసులు పెద్ద ఎత్తున నగదును స్వాధీనం చేసుకోగా..శుక్రవారం ఉదయం పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తుండగా,ఓ కారులో రూ.70 లక్షల నగదును గుర్తించారు. అయితే ఆ మొత్తానికి సంబంధించిన రసీదు చూపించకపోవడంతో స్వాధీనం చేసుకున్నారు. నగదును తరలిస్తున్న వాహనంతోపాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.

అలాగే మునుగోడు నియోజకవర్గంలోని సంస్థాన్‌ నారాయణపురం మండలంలోని అంతారం గేటు వద్ద పోలీసులు వాహనాలను తనిఖీ చేయగా రూ.5.60 లక్షలు పట్టుబడ్డాయి. దీంతో నగదును తరలిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక మునుగోడు ఉప ఎన్నిక మరో ఆరు రోజుల్లో జరగనుండడంతో పలు పార్టీల నేతలు పెద్ద ఎత్తున నగదును తరలిస్తున్నారు. ఓటర్లకు డబ్బును పంచేందుకే ఈ డబ్బును తరలిస్తున్నట్లు పోలీసులు భావిస్తున్నారు.