కాలినడకతో హత్రాస్ దిశగా పయనం
రాహుల్, ప్రియాంకల కాన్వాయ్ ను అడ్డుకున్న పోలీసులు..
పోలీసులు నన్ను నెట్టేశారు.. లాఠీచార్జ్ చేశారు.. రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేతలు రాహుల్, ప్రియాంకలు హత్రాస్ బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి బయల్దేరారు. వాహనాల్లో వెళ్తున్న ఆ ఇద్దర్నీ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వాళ్లు కాలినడకలో హత్రాస్ దిశగా పయనం అయ్యారు. ఢిల్లీయూపీ హైవేపై రాహుల్ కాలిబట పట్టారు. ఆ సమయంలో పోలీసులు తనను నెట్టివేసినట్లు రాహుల్ ఆరోపించారు. తనపై లాఠీచార్జ్ కూడా చేసినట్లు ఆయన ఆరోపించారు. తనను నేలపై పడేసినట్లు రాహుల్ తెలిపారు. ప్రధాని మోడిని ఈ ప్రశ్న అడగాలనుకుంటున్నానని, కేవలం మోదీజీ మాత్రమే ఈ దేశంలో నడుస్తారా అని ఆయన ప్రశ్నించారు. ఓ సాధారణ వ్యక్తి కనీసం నడవలేరా అని ఆయన నిలదీశారు. మా వాహనాలను అడ్డుకోవడం వల్ల నడక ప్రారంభించినట్లు ఆయన చెప్పారు. హత్రాస్కు 140 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రేటర్ నోయిడా వద్ద రాహుల్ వాహనాన్ని నిలిపేశారు.
అయితే వాహనాలు దిగిన రాహుల్, ప్రియాంకాలు.. వందకుపైగా కిలోమీటర్ల దూరంలో ఉన్న హత్రాస్కు కాలినడకన వెళ్తున్నారు. మరోవైపు ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా పోలీసు యంత్రాంగం ముందస్తు చర్యలకు ఉపక్రమించింది. జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి నిషేధాజ్ఞలు విధిస్తున్నట్టు కలెక్టర్ పీకే లక్షకర్ ప్రకటించారు. ‘జిల్లాలో సెక్షన్ 144 విధించాం. ఈ నెల 31 వరకు ఇది అమల్లో ఉంటుంది’ అని ఆయన గురువారం ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు హత్రాస్ జిల్లా సరిహద్దులను కూడా మూసివేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/