బండి సంజయ్ కి పోలీసులు షాక్..పాదయాత్రను నిలిపేయాలని నోటీసులు

బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కి పోలీసులు షాక్ ఇచ్చారు. బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు జారీచేశారు. ఈ మేరకు ప్రజా సంగ్రామ యాత్ర ప్రముఖ్ గంగిడి మనోహర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శలు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్ కు వర్ధన్నపేట ఏసీపీ ఆదేశాలు జారీ చేశారు. జనగామలో కొనసాగుతోన్న బండి సంజయ్ యాత్రను తక్షణమే నిలిపివేయాలని నోటీసుల్లో పేర్కొన్నారు.

పాదయాత్ర పేరుతో బీజేపీ నాయకులు విద్వేషాలు రెచ్చగొడుతున్నారని పోలీసులు పేర్కొన్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారని ..రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రప్పిస్తుండటంతో జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. నోటీసును పరిగణలోకి తీసుకోకుండా తిరిగి ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. మరి ఈ నోటీసుల ఫై బండి సంజయ్ ఎలా స్పందిస్తారో చూడాలి.