ఏపీలో జీవో నెం.1పై వివరణ ఇచ్చిన ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ

ఏపీలో రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జీవో 1 ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ జీవో ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తుంది. రోజు రోజుకు ఓ వివాదం గా ఈ జీవో 1 మారుతుండడం తో..ఏపీ లా అండ్ ఆర్డర్ డీజీ ఈ జీవో ఫై స్పష్టత ఇచ్చారు. సభలు, సమావేశాలపై ఎలాంటి నిషేధం లేదని క్లారిటీ ఇచ్చారు. కాకపోతే నియమనిబంధనలకు లోబడి సభలు, సమావేశాలు జరుపుకోవాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఇటీవల టిడిపి సభల్లో జరిగిన ఘటనలను పరిగణనలోకి తీసుకుని ఈ జీవో తీసుకువచ్చినట్టు డీజీ వెల్లడించారు.

1861 చట్టానికి లోబడే జీవో నెం.1 తీసుకువచ్చారని వివరించారు. షరతులకు లోబడి సభలు, సమావేశాలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఇక మీడియా సమావేశంలో పాల్గొన్న మరో పోలీసు ఉన్నతాధికారి జీవోలోని అంశాలను చదివి వినిపించారు. రవాణా వ్యవస్థకు అంతరాయం కలుగుతుందన్న నేపథ్యంలో జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు పోలీసులు అనుమతి నిరాకరించ వచ్చని తెలిపారు.

ఆయా సభలకు పోలీసులు ప్రత్యామ్నాయ వేదికలు సూచిస్తారని, లేకపోతే సభల నిర్వాహకులే ప్రత్యామ్నాయాలు సూచించవచ్చని పేర్కొన్నారు. అయితే కొన్ని అరుదైన పరిస్థితుల్లో సభలకు అనుమతి ఇవ్వడం జరుగుతుందని, ఎక్కడా సభలను నిషేధిస్తామని జీవోలో చెప్పలేదని వివరించారు. ఇది జాతీయ రహదారులు, రాష్ట్ర రహదారులపై సభలకు వర్తిస్తుందని తెలిపారు.