గోదావ‌రికి వ‌ర‌ద‌ నీరు .. పోల‌వ‌రం 48 గేట్లు ఎత్తివేత‌

polavaram-project-48-gates-lifted

అమరావతిః ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి పోలవరం వద్ద ఉగ్రరూపం దాలుస్తోంది. ప్రాజెక్టు 48 గేట్లు ఎత్తి.. 9 ల‌క్ష‌ల క్యూసెక్కుల నీటిని దిగువ‌కు విడుద‌ల చేస్తున్నారు. మ‌ధ్యాహ్నానికి 12 ల‌క్ష‌ల క్యూసెక్కుల వ‌ర‌ద వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అధికారులు అంచ‌నా వేస్తున్నారు. గోదావ‌రిలో గంట గంట‌కు వ‌ర‌ద ప్ర‌వాహం పెరుగుతూనే ఉంది. వ‌ర‌ద ఉధృతి కార‌ణంగా పోల‌వ‌రం ప్రాజెక్టు ప‌నులు నిలిచిపోయాయి. ప్ర‌స్తుతం పోల‌వ‌రం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం 32.2 మీట‌ర్లకు చేరుకుంది. గంట‌కు 35 సెం.మీ. చొప్పున గోదావ‌రి నీటిమ‌ట్టం పెరుగుతోంది.

ప్రాజేక్టు 48 గేట్ల నుండి గంటకు లక్ష 98 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో పోలవరం, పట్టిసీమ, దిగువన గోదావరి ఉరకలేస్తూ ప్రవహిస్తోంది. .భద్రాచలం వద్ద సాయంత్రం 36 అడుగుల మేర నీటిమట్టం నమోదైంది. రాత్రికి ఇది మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. వరద ప్రమాదం దృష్ట్యా ఇప్పటికే 19 గిరిజన గ్రామాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిఃhttps://www.vaartha.com/telangana/