అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని ప్రసంగం
న్యూఢిల్లీ: నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. నేడు ప్రపంచమంతా కరోనాతో పోరాడుతోందని, ఈ మహమ్మారిని ఓడించగలమనే నమ్మకాన్ని యోగా అందిస్తున్నదన్నారు. ఒత్తిడి తగ్గించడంలో, శారీరక బలాన్నిపెంపొందింపజేయడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. పబ్లిక్ హెల్త్ కేర్ విషయంలోనూ యోగా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.
యోగాపై ప్రజలకు ఆసక్తి పెరిగిందని, ఉత్సాహంగా యోగా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని అన్నారు. కోవిడ్ కాలంలో యోగాపై ప్రజలకు మరింత ఆసక్తి పెరిగిందన్నారు. యోగా కారణంగా మన శరీరానికి జరిగే మేలు గురించి ప్రపంచవ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయని మోడీ పేర్కొన్నారు. యోగాతో మంచి ఆరోగ్యం సమకూరుతుందని, దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుందన్నారు. యోగా అనేది శారీరక, మానసిక దృఢత్వాన్ని పెంపొందిస్తుందని, అంతః చైతన్యాన్ని వృద్ధి చేస్తుందని తెలిపారు. అనేక వ్యాధులకు ముందస్తు రక్షణ కవచంగా యోగా ఉపయోగపడుతుందని ప్రధాని పేర్కొన్నారు. యోగా ఫర్ వెల్ నెస్ థీమ్తో ఈ ఏడాది యోగా డేని నిర్వహిస్తున్నామన్నారు. శారీరక, మానసిక ఆరోగ్యం కోసం యోగాను అనుసరించాలనేది ఈ నినాదం ఉద్దేశమని ప్రధాని మోడి పేర్కొన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/