వారణాసి ఆధారిత స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధని నరేంద్రమోడి ఈరోజు ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన ఎన్జీవో సంస్థల ప్రతినిధులతో వీడియోకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈసందర్భంగా మోడి మాట్లాడుతూ..కరోనా సంక్షోభ సమయంలో ఎన్జీవోలు ఎంతో మేలు చేశాయని, బాధ్యతతో పనిచేయడం ఓ కొత్త తరహా సేవ అని కీర్తించారు. శ్రావణ మాసంలో వారణాసి ప్రజలతో మాట్లాడడం.. భోలేనాథుడి దర్శనం చేసుకున్నట్లు ఉందన్నారు. కోవిడ్ వేళ వారణాసి ఉత్సాహాంగా ఉందంటే.. అది భోలేనాధుడి ఆశీస్సుల వల్లే అని మోడి తెలిపారు. అధిక జనభా కలిగిన యూపీలో కరోనా వైరస్ వల్ల మరణాలు ఎక్కువ శాతం ఉంటాయని నిపుణులు చెబుతున్నారని, కానీ అలా జరగలేదని ప్రధాని మోడి అన్నారు. యూపీలో దాదాపు 24 కోట్ల జనాభా ఉన్నదని, ప్రజల సహాకారంతో కరోనా వైరస్ భయాల నుంచి బయటపడినట్లు మోడి తెలిపారు. యూపీలో ఉన్న జనాభాకు సమానంగా బ్రెజిల్లోనూ జనాభా ఉన్నదని, కానీ బ్రెజిల్లో కోవిడ్19 వల్ల 65 వేల మంది మరణించారని, కానీ యూపీలో ఇప్పటి వరకు కేవలం 800 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రధాని మోడి తెలిపారు. అంటే యూపీలో మనం ప్రాణాలను కాపాడుకున్నట్లే అని ఆయన స్పష్టం చేశారు.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/