కరోనా పరిస్థితిపై సీఎంలతో ప్రధాని సమావేశం
న్యూఢిల్లీ: భారత్ లో కరోనా కేసులు మళ్లీ ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కొవిడ్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తున్నారు. దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపాల్సిందేనని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ప్రధాని స్పష్టం చేశారు . దీనికోస నిర్ణయాత్మక అడుగులు వేయాలని చెప్పారు. రాష్ట్రాల అభ్యర్థన మేరకు 45 ఏళ్లు పైబడిన వాళ్లందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలని ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రతిపాదించింది. ఇక కరోనాకు చెక్ పెట్టడానికి మాస్క్లు తప్పనిసరి చేయాలని, భౌతిక దూరం నిబంధనలను కఠినంగా అమలు చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. జనం గుమిగూడే అవకాశం ఉన్న ఈవెంట్లలో అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని కూడా స్పష్టం చేసింది. టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్, వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగాలని సూచించింది.
ఇక ఇండియాలో ఇప్పటి వరకూ 96 శాతం మంది కోలుకున్నారని, చనిపోయిన వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్న దేశాల్లో ఇండియా కూడా ఒకటని ఈ సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారు. ప్రజలను భయభ్రాంతులకు గురి చేయాల్సిన అవసరం లేదు. పరిస్థితులను అలా ఆందోళనకరంగా చేయాల్సిన పని లేదు. కొన్ని ముందు జాగ్రత్తలు, చర్యల ద్వారా ప్రజల కష్టాలను దూరం చేయాలి అని మోడీ సూచించారు. కొన్ని ప్రాంతాల్లో టెస్టుల సంఖ్య తగ్గడాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఎందుకు టెస్టుల సంఖ్య తగ్గిందని ప్రశ్నించారు. మన కాన్ఫిడెన్స్, ఓవర్ కాన్ఫిడెన్స్గా మారకూడదు అని స్పష్టం చేశారు.
ఇక వ్యాక్సిన్ వృథాపై కూడా ప్రధాని మాట్లాడారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్లలో వ్యాక్సిన్ వృథా 10 శాతం కంటే ఎక్కువగా ఉన్నదని మోదీ చెప్పారు. రాష్ట్రాలు వ్యాక్సిన్ వృథాను సమీక్షించాలని సూచించారు. అసలు ఎందుకు వృథా అవుతోందో ప్రతి రోజూ పర్యవేక్షించాలని, అసలు వృథా లేకుండా చూడాలని స్పష్టం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/