అంతరిక్షంలోకి ప్రధాని మోడి ఫోటో!

ఈ నెల 28న ప్రైవేటు ఉపగ్రహం ద్వారా పంపనున్న ఇస్రో

న్యూఢిల్లీ: భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ఈ సంవత్సర తొలి ప్రయోగానికి సిద్ధమైంది. అంతేకాక ఇస్రో ను స్థాపించి ఐదు దశాబ్దాలు అయిన సమయంలో నింగిలోకి ఓ శాటిలైట్ ద్వారా ప్రధాని నరేంద్రమోడి చిత్రంతో పాటు భగవద్గీతను, మరో 25 వేల మంది పౌరుల పేర్లను పంపాలని నిర్ణయించారు. వీరిలో వివిధ రంగాల్లో విశేష సేవలను అందించిన వారు. అవార్డులను అందుకున్న వారి పేర్లూ ఉంటాయని సైంటిస్టులు తెలిపారు.

ఈ నెల 28న పీఎస్ఎల్వీ సీ51 ను ప్రయోగించనున్న ఇస్రో, దాని ద్వారా అమెజానియా1తో పిటు ఇండియన్ ప్రైవేటు కంపెనీలు తయారు చేసిన ఆనంద్, యునిటీశాట్, సతీశ్ ధావన్ ఉపగ్రహాలను సైతం నింగిలోకి పంపనుందన్న సంతి తెలిసిందే. వీటిల్లో ఆనంద్ కు కొంత ప్రత్యేక ఉంది. కర్ణాటకకు చెందిన స్టార్టప్ కంపెనీ ‘పిక్సెల్’ దీన్ని తయారు చేసింది. దీనితో పాటే సతీశ్ ధావన్ పేరిట తయారైన ఉపగ్రహాన్ని స్పేస్ కిడ్జ్ ఇండియా రూపొందించింది. వీటితో కోయంబత్తూరు కాలేజీ విద్యార్థులు తయారు చేసిన శ్రీశక్తి శాట్ం నాగపూర్ సైంటిస్టులు తయారు చేసిన జీహెచ్ఆర్సీఈ శాట్ తదితరాలు కూడా తమతమ కక్ష్యల్లోకి వెళ్లనున్నాయి.

ఈ నేపథ్యంలోనే ప్రధాని మోడి ఫోటోను స్పేస్ లోకి పంపించనున్నామని స్పేస్ కిడ్జి ప్రకటించింది. మోడి పేరు, దాని కింద ఆత్మ నిర్భర్ భారత్ పదాలు, భగవద్గీత ప్రతి, 25 వేల మంది పేర్లను పంపనున్నామని సంస్థ సీఈఓ డాక్టర్ శ్రీమతి కేసన్ వెల్లడించారు. స్పేస్ లోకి పంపేందుకు పేర్లు కావాలని అడుగగా, విశేష స్పందన వచ్చిందని, 1000 మంది విదేశీయులు, చెన్నైలోని ఓ పాఠశాల విద్యార్థులందరి పేర్లతో సహా 25 వేల ఎంట్రీలు వచ్చాయని, వాటన్నింటినీ స్పేస్ లోకి పంపనున్నామని ఆమె పేర్కొన్నారు.

కాగా, ఈ రాకెట్ 28వ తేదీ ఉదయం 10.24 గంటలకు పీఎస్ఎల్వీ సీ51 వాహక నౌక ద్వారా నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో ఉన్న షార్ అంతరిక్ష కేంద్రం నుంచి నింగిలోకి ఎగరనుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/