నేడు చైనా అధ్యక్షుడితో మాట్లాడనున్న ప్రధాని మోడి

నేడు ఎస్సీఓ అధినేతల సమావేశం

pm modi

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు చైనా అధ్యక్షుడు జీ జిన్ పింగ్ తో ముఖాముఖి మాట్లాడనున్నారు. ఇందుకు నేడు జరిగే 20వ ఎస్సీఓ అధినేతల సమావేశం వేదిక కానుంది. వర్చ్యువల్ గా సాగనున్న ఈవెంట్ లో సీమాంతర ఉగ్రవాదం, భారత సార్వభౌమత్వం, వివిధ దేశాల మధ్య ఆర్థిక సహకారం, ఆఫ్ఘనిస్థాన్ లో జరుగుతున్న దాడులు, ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధి, కరోనా కట్టడి తదితర అంశాలను మోడి ప్రస్తావించనున్నారు. ఇక ఈ సమావేశం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగనుండగా, పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా పాల్గొననున్నారు.

ఇక ఇమ్రాన్ ఖాన్ సమక్షంలోనే, ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలకు నరేంద్ర మోడి సీరియస్ వార్నింగ్ ఇస్తారని తెలుస్తోంది. ఆయా దేశాలు తక్షణమే ఉగ్రవాదాన్ని వదిలేయాలని, అందుకు తగ్గట్టుగా చర్యలు తీసుకోవాలని మోడి డిమాండ్ చేయనున్నారు. ఈ సమావేశం అనంతరం, మాస్కో డిక్లరేషన్ వెలువడనుండగా, పలు ఎస్సీఓ స్టేట్ మెంట్లు కూడా విడుదల కానున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం జరిగి 75 సంవత్సరాలు పూర్తి కావడం, కరోనాపై పోరాటం, కౌంటర్ టెర్రరిజం, డ్రగ్ థ్రెట్ తదితర అంశాలపై ఎస్సీఓ సమావేశం అనంతరం ప్రకటనలు వెలువడనున్నాయి. పలు దేశాల మధ్య వాణిజ్య, ఆర్థిక సంబంధాలపైనా నేతలు ఓ ప్రకటన చేయనున్నారు.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/