ఈ నెల 19న సికింద్రాబాద్-విజయవాడ వందేభారత్ రైలు ప్రారంభం

జనవరి 19 న సికింద్రాబాద్-విజయవాడ మధ్య నడిచే వందేభారత్ రైలును ప్రధాని మోడీ ప్రారభించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో జరిగే ఈ కార్యక్రమంలో ప్రధాని పచ్చజెండా ఊపి ఈ రైలును ప్రారంభిస్తారు. ముందుగా ఈ రైలు సికింద్రాబాద్ నుంచి విజయవాద మధ్య నడవనుంది. ఆ తరువాత ఇదే రైలును విశాఖ వరకు పొడించేందుకు ఆలోచన చేస్తున్నారు. ఈ రైలు ద్వారా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నాలుగు గంటల్లోనే చేరుకొనే అవకాశం కలుగుతుంది.
ఇక ప్రధాని మోడీ ఈ నెల 19న ప్రధాని కర్ణాటక గుల్బర్గా నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. దేశ వ్యాప్తంగా వందేభారత్ రైళ్లను ప్రధాని స్వయంగా ప్రారంభిస్తున్నారు. అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాలకు వందేభారత్ రైలు కేటాయిస్తూ రెండు నెలల క్రితం ప్రధాని అటు విశాఖ..ఇటు తెలంగాణలోని రామగుండం పర్యటన సమయంలో నిర్ణయం జరిగింది. వందేభారత్ ను ప్రారంభించటంతో పాటుగా సికింద్రబాద్ రీడెవలప్ మెంట్ పనులకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఇందు కోసం రూ 699 కోట్లు ఖర్చు చేయనున్నారు. ప్రస్తుత భవనాలను కూల్చి అంతర్జాతీయ ప్రమాణాలు.. పూర్తిస్థాయి వసతులతో నూతనంగా నిర్మించనున్నారు. 36 నెలల్లో ఈ పనులు పూర్తి కానున్నాయి.
ఇక వందేభారత్ ట్రైన్ విషయానికి వస్తే… దేశంలోనే అత్యంత వేగంగా వెళ్లే సెమీ హైస్పీడ్ రైలు. గతేడాది భారత రైల్వే 7 వందేభారత్ ఎక్స్ ప్రెస్ లను వివిధ మార్గాల్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-కత్రా, గాంధీనగర్- ముంబయి సెంట్రల్, న్యూఢిల్లీ-అంబ్ అందౌరా, చెన్నై-మైసూరు, బిలాస్ పూర్-నాగపూర్, హౌరా-న్యూ జల్పాయ్ గురి స్టేషన్ల మధ్య వందేభారత్ రైళ్లు పరుగులు తీస్తున్నాయి. వందేభారత్ రైలు ట్రయల్ రన్ లో గంటకు 180 కిమీ వేగం అందుకోవడం విశేషం.