నేడు తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటించనున్న ప్రధాని

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన

న్యూఢిల్లీ: నేడు ప్రధాని నరేంద్రమోడి తమిళనాడు, పుదుచ్చేరిలో పర్యటించనున్నారు. త్వరలో జరుగనున్న రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఆయన ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా పలు అభివృద్ధి పనులకు పునాది రాయి వేయనున్నారు. ఉదయం 11.30గంటలకు పుదుచ్చేరిలోని కరైకల్‌ జిల్లా పరిధిలోని విల్లుపురం నుంచి నాగపట్నం వెళ్లే 56 కిలోమీటర్ల నాలుగులైన్ల జాతీయ రహదారికి శంకుస్థాపన చేస్తారని పీఎంఓ తెలిపింది. ప్రాజెక్టుకు రూ.2,426 కోట్లు కేంద్రం కేటాయించింది. న్యూ క్యాంపస్‌ఫేజ్‌ 1, కరైకల్‌ జిల్లా (జిప్‌మర్‌), వద్ద మెడికల్‌ కాలేజీ భవనానికి పునాది రాయి వేస్తారని, పుదుచ్చేరిలోని జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్ పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ మెడికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (జిప్‌మర్‌)లో బ్లడ్‌బ్యాంక్‌ సెంటర్‌ను ప్రారంభించనున్నారు.


కాగా, తమిళనాడులో సాయంత్రం 4 గంటలకు నైవేలి నిర్మించిన నైవేలి థర్మల్‌ విద్యుత్‌ ప్రాజెక్టును జాతికి అంకితం చేయనున్నారు. అలాగే తిరునెల్వేలి, టుటికోరిన్, రామనాథపురం, విరుదునగర్ జిల్లాల్లో సుమారు 2670 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఎన్‌ఎల్‌సీఐఎల్ 709 మెగావాట్ల సౌర విద్యుత్‌ ప్రాజెక్టును సైతం ప్రారంభించనున్నారు. లోయర్‌ భవానీ ప్రాజెక్టు సిస్టమ్‌ ఆధునికీకరణ, వీఓ చిదంబరనార్‌ పోర్టులో కోరంపల్లం వంతెన, రైల్‌ ఓవర్‌ బ్రిడ్జి, ఐదుమెగావాట్ల డ్రిగ్‌ అనుసంధాన ప్రాజెక్టు కూడా ప్రధాని పునాది రాయి వేయనున్నారు.


ప్రధాని ఆవాస్‌ యోజన (అర్బన్‌) పథకం కింద నిర్మించిన అద్దె గదులు ప్రారంభించడంతో పాటు, కోయంబత్తూర్, మధురై, సేలం, తంజావూర్, వెల్లూరు, తిరుచిరప్పల్లి, తిరుప్పూర్, తిరునెల్వేలి, తూత్తుకుడి సహా తొమ్మిది స్మార్ట్‌ సిటీల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ల (ఐసీసీసీ) అభివృద్ధికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/