చౌరీ చౌరా ఉత్సవాలను ప్రారంభించనున్న ప్రధాని
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి ఈరోజు చౌరీ చౌరా శత జయంతి ఉత్సవాలను ప్రారంభించనున్నారు. ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లోని చౌరీ చౌరాలో ఉదయం 11 గంటలకు వీడియోకాన్ఫరెన్స్ ద్వారా వేడుకలను ప్రారంభిస్తారని పీఎంఓ తెలిపింది. ఈ సందర్భంగా పోస్టల్ స్టాంప్ను సైతం ప్రధాని ఆవిష్కరించనున్నారు. చౌరీ చౌరా ఘటనకు వచ్చే ఏడాదికి వందేళ్లు నిండనున్న నేపథ్యంలో ఏడాది పాటు ఉత్సవాలను నిర్వహించాలని యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది.
యూపీలోని 75 జిల్లాల్లో ఉత్సవాలు నేటితో ప్రారంభమై.. వచ్చే ఏడాది ఫిబ్రవరి 4వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా స్వాతంత్రోద్యమంతో సంబంధం ఉన్న 99 మందిని సత్కరించనున్నారు. చౌరీ చౌరా ఘటన జరిగిన ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ జిల్లాలోని స్మారక కేంద్రాన్ని పర్యటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/