రేపు విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధాని

pm modi

న్యూఢిల్లీ: రేపు విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోడి మాట్లాడనున్నారు. శనివారం సాయంత్రం 4:30 గంటలకు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ 2020’ గ్రాండ్‌ ఫినాలే కార్యక్రమంలో పాల్గొననున్న ప్ర‌ధాని.. ఆ సందర్భంగా ఆన్‌లైన్‌లో విద్యార్థులతో ముచ్చటించనున్నారు. నూతన విద్యా విధానంపై విద్యార్థుల‌తో అభిప్రాయాలను పంచుకోవడంతోపాటు ప‌లు అంశాల‌పై ఆయ‌న చ‌ర్చించ‌నున్నారు.

విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించడంలో భాగంగా 2017 నుంచి స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ను నిర్వహిస్తున్నారు. నిత్య జీవితంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కారం చూపేలా విద్యార్థులను ప్రోత్సహించడమే ల‌క్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వ‌హిస్తున్నారు. ప్రారంభమైన తొలి ఏడాదే 42 వేల మంది విద్యార్థులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. 2019కి ఆ సంఖ్య రెండు లక్షలకు పెరిగింది. ఈ సారి నాలుగు ల‌క్ష‌ల మందికిపైగా స్మార్ట్ ఇండియా హ్యాక‌థాన్‌లో పాల్గొన‌బోతున్నారు.

ఈ నెల 29న నూతన విద్యా విధానానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపిన నేప‌థ్యంలో.. విద్యార్థుల‌తో ప్ర‌ధానంగా దానిపైనే చ‌ర్చించే అవ‌కాశం ఉంది. కాగా, నూత‌న విధానంలో విద్యార్థుల సమగ్ర వికాసానికే పెద్దపీట వేశారు. అదే సమయంలో భారమూ తగ్గించే ప్రయత్నం చేశారు. మన విద్యా ప్రమాణాలు అంతర్జాతీయ స్థాయిని అందుకునేలా మార్పులకు శ్రీకారం చుట్టారు. 10+2+3 స్థానంలో 5+3+3+4 విద్యా విధానాన్ని అమలులోకి తీసుకొచ్చారు. ఇంటర్‌ను పాఠశాల విద్యలో చేర్చారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/