భారత నౌకాదళ అమ్ములపొదిలోకి ఐఎన్ఎస్ విక్రాంత్
కొచ్చిః భారత నౌకాదళ అమ్ములపొదిలోకి మరో అస్త్రం చేరుతోంది. ఐఎన్ఎస్ విక్రాంత్ నౌకాదళంలోకి చేరింది. కేరళ కొచ్చిన్లో ప్రధాని మోడీ ఐఎన్ఎస్ విక్రాంత్ను ప్రారంభించారు. దేశీయంగా తయారుచేసిన తొలి ఎయిర్క్రాఫ్ట్ క్యారియర్ ఐఎన్ఎస్ విక్రాంత్కి చాలా స్పెషాలిసిటీస్ ఉన్నాయి. భారతీయుడి ఆత్మ నిర్భరతకు, మేథస్సుకు ప్రతీకగా ఐఎన్ఎస్- విక్రాంత్ నిలవనుంది. 1971 యుద్ధంలో సేవలు అందించిన దేశ మొదటి విమాన వాహక నౌక.. ఐఎన్ఎస్-విక్రాంత్ పేరుతోనే దీనికి నామకరణం చేశారు. స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేసిన ఈ అత్యాధునిక యుద్దనౌక ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదగా భారత అమ్ముల పొదిలోకి ఈరోజు చేరుతుంది.
కాగా, 262 మీటర్ల పొడవు, 62 వెడల్పును కలిగిన ఉన్న ఈ బాహుబలి నౌక, గంటకు గరిష్ఠంగా 28 నాటికల్మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది. అంటే గంటకు 51.8 కిలోమీటర్ల స్పీడుతో సముద్రంలో దూసుకెళ్లనుంది. ఐఎన్ఎస్ విక్రాంత్ ద్వారా 30 యుద్ధ విమానాలు, హెలికాప్టర్లను తీసుకెళ్లొచ్చు. 45వేల టన్నుల ఈ యుద్ధ నౌక నుంచి శత్రు దేశాల విమానాలు, క్షిపణులను లక్ష్యంగా చేసుకోవచ్చు. యుద్ధ సమయాల్లో విమానాలు అలా గాల్లోకి ఎగిరి, శత్రువు పని పట్టేసి ఇలా తిరిగి వచ్చేసేలా ఈ యుద్ధ నౌకలో ఏర్పాట్లు ఉన్నాయి. ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధనౌకలో 1,700 మంది సిబ్బంది విధులు నిర్వహించనున్నారు. యుద్ధ సమయంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలు అందించేందుకు యుద్ధనౌకలో భారీ ఏర్పాట్లు చేశారు. 16 పడకలతో చిన్నపాటి ఆసుపత్రిని నిర్మించారు. అలాగే రెండు ఆపరేషన్ థియేటర్లు, ల్యాబొరేటరీలు, వార్డులు, ఐసీయూలు, ఒక సీటీ స్కాన్మెషీన్ ఉన్నాయి. ఇక్కడ ఐదుగురు వైద్య అధికారులు, 15 మంది ఆరోగ్య సిబ్బంది పనిచేస్తారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/