స్వల్పంగా పెరిగిన ప్రధాని ఆస్తుల విలువ
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆస్తుల విలువ గత ఏడాదితో పోలిస్తే స్వలంగా పెరిగింది. మోడీ తాజా డిక్లరేషన్ ప్రకారం ఆయన ఆస్తుల విలువ రూ.22 లక్షలు పెరిగింది. గత ఏడాది రూ 2.85 కోట్లుగా ఉన్న ప్రధాని నికర సంపద రూ 22 లక్షలు ఎగబాకి రూ 3.07 కోట్లకు చేరింది. ప్రధాని తాజా డిక్లరేషన్ ప్రకారం మోడీ బ్యాంక్ బ్యాలెన్స్ మార్చి 31 నాటికి రూ 1.5 లక్షలు, రూ 36,000గా ఉంది. ఇక ఎస్బీఐ గాంధీనగర్ బ్రాంచ్లో గత ఏడాది రూ 1.6 కోట్లుగా ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్లు ఈ ఏడాది మార్చి 31 నాటికి రూ 1.86 కోట్లకు పెరగడంతో మోడీ సంపద ఆ మేరకు ఎగబాకింది.
డిక్లరేషన్ ప్రకారం ప్రధాని మోడీకి స్టాక్ మార్కెట్ పెట్టుబడులు, మ్యూచ్వల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ నుంచి ఎలాంటి సంపద సమకూరలేదు. ఇక మోడీ నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లో రూ 8,93,251. ఎల్ఐసీ పాలసీల్లో రూ 1,50,957, ఎల్అండ్టీ ఇన్ఫ్రా బాండ్స్లో రూ 20,000 చొప్పున ఇన్వెస్ట్ చేవారు. ప్రధాని మోడీకి రూ 1.48 లక్షల విలువైన నాలుగు గోల్డ్ రింగ్స్ ఉన్నాయి. మోడీకి రూ 1.97 కోట్ల విలువైన చరాస్తులు ఉండగా ఆయన పేరుతో ఎలాంటి వ్యక్తిగత వాహనం లేదు. బ్యాంకులు, ఆర్ధిక సంస్థల నుంచి ఆయన ఎలాంటి రుణం తీసుకోలేదు.
ఇక 2002లో గుజరాత్ సీఎం బాధ్యతలు చేపట్టేందుకు రెండు నెలల ముందు మోడీ గుజరాత్లోని గాంధీనగర్, సెక్టార్ 1లో ముగ్గురు సహ యజమానులతో కలిసి 3543 చదరపు అడుగుల ప్లాట్ను కొనుగోలు చేశారు. అప్పట్లో దీని ఖరీదు రూ 1.3 లక్షలు కాగా భూమిపై రూ2.4 లక్షలు పెట్టుబడి పెట్టగా ప్రస్తుతం దాని విలు రూ 1.10 కోట్లు పలుకుతోంది. 2014లో ప్రధాని బాధ్యతలు చేపట్టిన అనంతరం మోడీ ఎలాంటి ఆస్తులనూ కొనుగోలు చేయలేదు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/