ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్ అందిస్తాం..ప్రధాని

అందుబాటులోకి రాగానే పంపిణీ ..మోడి

PM Modi says all Indians will get coronavirus vaccine

న్యూఢిల్లీ: కరోనా వ్యాక్సిన్ అందుబాటులోకి రాగానే దేశంలోని ప్రజలందరికీ అందిస్తామని ప్రధాని మోడి తెలిపారు. ఏ ఒక్క వ్యక్తినీ విడిచిపెట్టకుండా, అందరికీ వ్యాక్సిన్ అందుబాటులోకి తేస్తామని ప్రకటించారు. ఓ జాతీయ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రధాని మోడి వ్యాక్సిన్ గురించి మాట్లాడారు. తాము ఎవర్నీ మరిచిపోమని హామీ ఇస్తున్నానని, మొదట్లో మాత్రం కొవిడ్ వారియర్స్‌ పైనే సహజంగా దృష్టి సారిస్తామని తెలిపారు. వ్యాక్సిన్ పంపిణీ కోసం ఇప్పటికే జాతీయ నిపుణుల బృందం ఏర్పాటైందని, వారు వ్యాక్సిన్ పంపిణీ ప్రణాళికలను నిర్దేశిస్తారని చెప్పారు. వ్యాక్సిన్ ప్రతి వ్యక్తికి చేరేలా 28 వేలకు పైగా కోల్డ్ చైన్ పాయింట్లును సిద్ధం చేయనున్నామని అన్నారు.

రాష్ట్ర, జిల్లా, స్థానిక స్థాయిల్లో ఏర్పాటు చేసిన బృందాలు నిష్పక్షపాతంగా, పారదర్శకంగా వ్యాక్సిన్ ను పంపిణీని పర్యవేక్షిస్తాయని వివరించారు. కాగా, కరోనా ఎపుడు ఎలా విస్తరిస్తుందో అర్థం కావడం లేదని, ఒకసారి గుజరాత్, మరోసారి కేరళ, కర్ణాటక ఇలా కొన్ని ప్రాంతాలను హాట్ స్పాట్లుగా గుర్తిస్తున్నామని తెలిపారు. అయితే, మళ్లీ కరోనా వ్యాప్తి మరో ప్రాంతంలో ఉద్ధృతంగా మారుతోందని చెప్పారు. దేశ ప్రజలంతా కరోనా నిబంధనలు పాటించాలని ఆయన సూచించారు. కాగా, తాము మరోసారి బీహార్ లో అధికారంలోకి వస్తే అక్కడి ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందిస్తామని బిజెపి హామీ ఇచ్చిన నేపథ్యంలో దానిపై దేశంలోని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోడి వ్యాక్సిన్ ను అందరికీ అందిస్తామని ప్రకటించడం గమనార్హం.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/