పంజాబ్‌లో ప్రధాని మోడీ ర్యాలీ రద్దు

న్యూఢిల్లీ: భారీ వర్షాల కారణంగా ప్రధాని నరేంద్ర మోడీ ఫిరోజ్‌పూర్‌ ర్యాలీని రద్దు చేశారు. బుధవారం ఉదయం ఫిరోజ్‌పూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోడీ పంజాబ్ చేరుకున్నారు. మోడీ షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీ అమృత్‌సర్ కత్రా ఎక్స్‌ప్రెస్‌వే, శాటిలైట్ సెంటర్‌తో సహా రూ. 42,750 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ఇక్కడ ర్యాలీ స్థలం నుండి శంకుస్థాపన చేయాలని నిర్ణయించారు. బుధవారం ఉదయం, ప్రధాని మోడీ విమానంలో బటిండాలో దిగారు. ఆ తర్వాత భారతదేశం పాకిస్తాన్ సరిహద్దు సమీపంలో ఉన్న జిల్లాకు బయలుదేరారు. రెండేళ్ల తర్వాత ప్రధాని మోడీ ఈరోజు పంజాబ్ చేరుకున్నారు. అదే సమయంలో ప్రభుత్వం వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత ప్రధాని రాష్ట్రానికి రావడం ఇదే తొలిసారి. ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు ముందు రాష్ట్రంలోని ఫిరోజ్‌పూర్ జిల్లాలో దాదాపు 10,000 మంది భద్రతా సిబ్బందిని మోహరించారు.

మరోవైపు పంజాబ్ పర్యటనలో ప్రధాని మోడీకి నిరసన సెగ తగిలింది. అన్నదాతల ఆందోళన మోడీ టూర్‌కు అడ్డంకిగా మారింది. ఫలితంగా పంజాబ్‌ పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. ఇటీవల కాలంగా రాష్ట్రాల్లో వరుస పర్యటనలు జరుపుతున్నారు ప్రధాని మోడీ. అక్కడ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనల్లో పాల్గొనాల్సి ఉంది. మోడీ పర్యటనను నిరసిస్తూ.. రైతులు ఎక్కడికక్కడ రోడ్లను దిగ్బంధించారు. మోడీ కాన్వాయ్‌ ముందుకు కదిలే పరిస్థితి లేకుండా పోయింది. చేసేది లేక ప్రధాని మోడీ తన పర్యటనను అర్ధంతరంగా రద్దు చేసుకున్నారు. భద్రతా కారణాల రీత్యా ఫిరోజ్‌పూర్‌ టూర్‌ రద్దు అయ్యినట్లు అధికారులు తెలిపారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/