చైనా పరిణామల పట్ల మోడి అసంతృప్తిగా ఉన్నారు
భారత్చైనా ఉద్రిక్తతలపై మోడితో మాట్లాడాను.. ట్రంప్
మధ్యవర్తిగా ఉండేందుకు నేను సిద్ధం..ట్రంప్
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ భారత్- చైనా మధ్య ఏర్పడిన సరిహద్దు వివాదంపై భారత్ ప్రధాని మోడితో మాట్లాడినట్లు తెలిపారు. భారత్ – చైనా మధ్య చోటు చేసుకుంటున్న ఉద్రిక్త పరిస్థితులను చల్లార్చేందుకు తాను మధ్యవర్తిగా ఉండేందుకు సిద్ధంగా ట్రంప్ మరోసారి చెప్పారు. శ్వేతసౌధంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ… చైనాతో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల మోడి అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ‘ఈ రెండు దేశాల మధ్య పెద్ద వివాదం ఉంది. భారత్, చైనాలో 1.4 బిలియన్ల చొప్పున జనాభా ఉంది. ఇరు దేశాలకు చాలా శక్తిమంతమైన సైనిక శక్తి ఉంది. ఈ వివాదం పట్ల భారత్, చైనా అసంతృప్తితో ఉన్నాయి’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. తాను భారత్, చైనా మధ్య మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ అన్నారు. అయితే, ఆ ఆఫర్ను భారత్ సున్నితంగా తిరస్కరించింది.
కాగా, లడఖ్ సరిహద్దులోని పాంగాంగ్, గాల్వన్ ప్రాంతాల్లో నియంత్రణ రేఖ వెంట చైనా తన బలగాల్ని మోహరిస్తూ, పలు నిర్మాణాలు చేపడుతుండడంతో భారత్ కూడా అందుకు దీటుగా ఆ ప్రాంతాల్లో మౌలిక వసతులు పెంచుకుంటోంది. దీంతో చైనా బలగాలు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకోవడంతో భారత సైన్యం కూడా అదే రీతిలో ఎప్పటికప్పుడు దీటుగా సమాధానం ఇస్తోంది.
తాజా వీడియోస్ కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/videos/