మంత్రివర్గంలో భారీ మార్పులు ?

పార్టీ వర్గాల్లో వినిపిస్తున్న ఊహాగానాలు
అమిత్‌ షా, నడ్డాతో మోడీ సమావేశం

న్యూఢిల్లీ: ప్రధాని మోడీ గురువారం నుంచి వివిధ మంత్రిత్వ శాఖల పనితీరుని సమీక్షిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం కూడా పలువురు మంత్రులతో సమావేశమయ్యారు. త్వరలో మంత్రివర్గ విస్తరణ ఉండనున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయా మంత్రుల పనితీరును అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. హోం మంత్రి అమిత్‌ షా, పార్టీ అధ్యక్షుడు జె.పి.నడ్డాతో మోడీ శుక్రవారం భేటీ అయ్యారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఖాయమన్న వార్తలు జోరందుకున్నాయి. ఆయా మంత్రుల పనితీరును బట్టి మంత్రివర్గంలో భారీ మార్పులు ఉండే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది.

మరోవైపు వచ్చే ఏడాది వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఓ భారీ సామాజిక పథకాన్ని ప్రవేశపెట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నిన్న దాదాపు ఐదు గంటల పాటు సుదీర్ఘ సమీక్ష నిర్వహించిన మోడీ.. ఏప్రిల్‌-మే నెలల్లో కొవిడ్‌ నియంత్రణపై ఆయా మంత్రిత్వ శాఖల పనితీరు ఎలా ఉందో సమీక్షించినట్లు సమాచారం. మరోవైపు, ఇది ఏటా నిర్వహించే సాధారణ సమీక్షేనని మరికొందరు అభిప్రాయపడ్డారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/international-news/