నేడు సిఎంలతో ప్రధాని మోడి సమావేశం

మధ్యాహ్నం 3 గంటల నుంచి వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్న మోడి

pm modi

న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోడి ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి, రేపు రాత్రి వరకూ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో స్వయంగా వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడనున్నారు. మంగళవారం నాడు 21 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో, బుధవారం నాడు మిగతా 15 రాష్ట్రాలసిఎంలతో ఆయన మాట్లాడనుండగా, బుధవారం నాటి సమావేశాలే దేశానికి అత్యంత కీలకమని తెలుస్తోంది.


అయితే నేడు పంజాబ్, అసోం, కేరళ, ఉత్తరాఖండ్, ఝార్ఖండ్, ఛత్తీస్ గఢ్, త్రిపుర, హిమాచల్ ప్రదేశ్, చండీగఢ్, గోవా, మణిపూర్, నాగాలాండ్, లడఖ్, పుదుచ్చేరి, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయ, మిజోరాం, అండమాన్ అండ్ నికోబార్, దాద్రా నగర్ హలేవీ అండ్ డామన్ డయ్యూ, సిక్కిం లక్షద్వీప్ సిఎంలతో ప్రధాని మోడి మాట్లాడనున్నారు. కాగా ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న అన్ని కరోనా కేసుల సంఖ్య, మొత్తం కేసుల్లో 20 శాతం కూడా లేవు. పలు రాష్ట్రాల్లో ప్రస్తుతం చికిత్స పొందుతున్న కేసుల సంఖ్య రెండంకెలను దాటలేదు.

ఇక బుధవారం నాడు ప్రధాని మొత్తం కేసుల్లో 30 శాతానికి పైగా ఉన్న మహారాష్ట్ర, 15 శాతం ఉన్న తమిళనాడుతో పాటు, వేల సంఖ్యలో కేసులు వచ్చిన ఢిల్లీ, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, బీహార్, ఆంధ్రప్రదేశ్, హర్యానా, జమ్మూ అండ్ కశ్మీర్, తెలంగాణ, ఒడిశా సిఎంలతో మాట్లాడనున్నారు. ఇండియాలోని కేసుల్లో 80 శాతానికి పైగా ఈ రాష్ట్రాల్లోనే ఉన్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/