అలీఘడ్కు ఇదో శుభదినం..ప్రధాని మోడీ
రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి మోడీ శంకుస్థాపన
అలీఘడ్: ప్రధాని మోడీ ఈరోజు ఉత్తరప్రదేశ్లోని అలీఘడ్లో రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ యూనివర్సిటీకి శంకుస్థాపన చేశారు. ఆ కార్యక్రమంలో గవర్నర్ ఆనందీబెన్, సీఎం యోగి పాల్గొన్నారు. ఈ సందర్భంగా యూపీ డిఫెన్స్ ఇండస్ట్రియల్ కారిడార్కు చెందిన ఉత్పత్తుల ఎగ్జిబిషన్ను ఆయన తిలకించారు. వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో.. అలీఘడ్లో మోదీ పర్యటన కీలకం కానున్నది.
శంకుస్థాపన తర్వాత మోడీ మాట్లాడుతూ.. అలీఘడ్కు ఇదో శుభదినం అని, వెస్ట్ యూపీకి కూడా అని తెలిపారు. రాధాష్టమి రోజున ఈ వేడుక జరగడం మరింత శుభప్రదం అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ మోడీ రాధాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సీఎం కల్యాన్ సింగ్ను మిస్ అవుతున్నట్లు ఆయన చెప్పారు. ప్రతాప్ సింగ్ వర్సిటీ అభివృద్ధితో ఆయన సంతోషించి ఉండేవారన్నారు.
జీవితంలో గొప్ప లక్ష్యాలను సాధించాలనుకుంటున్న యువకులంతా రాజా మహేంద్ర ప్రతాప్ సింగ్ జీవితాన్ని అధ్యయం చేయాలని మోదీ అన్నారు. రక్షణ రంగ ఉత్పత్తులను దిగుమతి చేసే ఇమేజ్ నుంచి ఇండియా బయటపడుతోందన్నారు. ప్రపంచ దేశాలకు ఇప్పుడు రక్షణ రంగ ఉత్పత్తులను ఎగుమతి చేసే స్థాయికి ఇండియా చేరినట్లు ఆయన తెలిపారు. ఆధునిక విద్యకు ప్రతాప్ సింగ్ వర్సిటీ కేంద్రంగా మారుతుందని, ఆ వర్సిటీలో రక్షణ సంబంధింత అంశాలు, రక్షణ ఉత్పత్తుల తయారీ టెక్నాలజీ గురించి స్టడీ చేయనున్నారన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/andhra-pradesh/